Senthil Kumar About SSMB29 Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో 'SSMB29' మూవీపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తుండగా... ఇప్పటివరకూ టీం అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మూవీపై ఏ చిన్న బజ్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతుంది.

అంతా కొత్తవారే

రాజమౌళి మూవీ అంటే సినిమాటోగ్రాఫర్ కచ్చితంగా సెంథిల్ కుమార్ అంటారు. గతంలో జక్కన్న తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీస్ కోసం ఆయన పని చేశారు. సెంథిల్ పనితీరును రాజమౌళి కూడా ఎన్నో సందర్భాల్లో ప్రశంసించారు. ఇప్పుడు 'SSMB29' మూవీకి కూడా ఆయనే పని చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సెంథిల్ కుమార్ స్పందించారు.

ఈ మూవీకి అందరూ కొత్త వారికే ఛాన్స్ ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలిపారు సెంథిల్. ఈ ప్రాజెక్టుకు తాను సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే... దర్శక ధీరుడు మెచ్చిన సినిమాటోగ్రాఫర్ ఎవరా? అంటూ చర్చ మొదలైంది.

కెన్యా లొకేషన్ క్యాన్సిల్

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఒడిశా, హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్స్‌లో కీలక సీన్స్ షూట్ చేశారు రాజమౌళి. జులై మూడో వారంలో కొత్త షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే... తాజాగా అక్కడ షూటింగ్ టీం రద్దు చేసుకుందట. కొంతకాలంగా కెన్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో అక్కడ షూటింగ్ జరపడం అంత సురక్షితం కాదని భావించిన టీం లొకేషన్ చేంజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 

కొత్త షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో జరగనున్నట్లు సమాచారం. అక్కడ ఎత్తైన కొండల్లో కొన్ని కీలక సీన్స్ షూట్ చేయనున్నట్లు టాక్. కెన్యాలో ఇంతకు ముందు చూసిన లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి మరీ టాంజానియా, దక్షిణాఫ్రికాలో షూటింగ్ అనుమతుల కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

Also Read: ఎన్టీఆర్ మైథలాజికల్‍పై 'రామాయణ' ఎఫెక్ట్ - బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ

స్టోరీపైనే అందరి దృష్టి

ఈ మూవీ స్టోరీపైనే అందరి దృష్టి ఉంది. జంగిల్ బ్యాక్ డ్రాప్‌గా ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఓ విజువల్ వండర్‌లా హాలీవుడ్ రేంజ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'రామాయణం'లోని సంజీవని శోధన మూవీకి సెంటర్ పాయింట్ అని సమాచారం. మహేష్ వెంట డైనోసార్లు వెంట పడేలా ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని అది మూవీకే హైలైట్ అనే రూమర్స్ వస్తున్నాయి. 

ఈ మూవీలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా... మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కోలీవుడ్ స్టార్ ఆర్.మాధవన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణన్ మూవీని రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... 2027లో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి లీక్స్  లేకుండా టీం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.