తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి. 1999 లో వచ్చిన 'స్వయంవరం' అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన వేణు, ఆ తర్వాత 'చిరునవ్వుతో', 'పెళ్ళాం ఊరెళితే', 'చెప్పవే చిరుగాలి', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాంతో పనేంటి', ఖుషి ఖుషీగా వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి సినిమాలు చేయడం మానేశాడు.


దానికి కారణాలేంటో తెలియకపోయినా మళ్ళీ అప్పుడెప్పుడో ఎన్టీఆర్ 'దమ్ము' సినిమాలో కీలక పాత్ర పోషించి మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వేణు క్యారెక్టర్ కి మంచి మార్పులే పడ్డాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన తోటి హీరో వడ్డే నవీన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


మీ సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అని అడిగిన ప్రశ్నకు వేణు బదులిస్తూ. "నేను, వడ్డే నవీన్, సిమ్రాన్, సింగర్ సునీత భర్త మ్యాంగో రామ్ ముంబైలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో క్లాస్ మేట్స్. మ్యాంగో రామ్ మాత్రం మొదట్లో మాతో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు తను సూట్ అవ్వనని తెలుసుకొని వేరే ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. ఆ ప్రొఫెషన్ లో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆ విషయంలో రామ్ ని మెచ్చుకోవాలి. ఇక ఇన్సిట్యూట్ లో నేను అందరితో చాలా కలివిడిగా, సరదాగా ఉండేవాడిని. కానీ వడ్డే నవీన్ మాత్రం అలా కాదు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నేను తెలుగు వాడినైనా నాతో ఎందుకు మాట్లాడట్లేదు? అని నేను అనుకునేవాడిని. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కానీ తెలుగు వాడ్ని అయ్యుండి నాతోని ఎందుకు మాట్లాడట్లేదు అనే సందేహం మాత్రం నాకు వచ్చింది. మనం మాట్లాడితే మాట్లాడుతాడు, కానీ తనే వచ్చి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నాకంటే వడ్డే నవీన్ రెండు నెలలు సీనియర్. నాకన్నా ముందే ముంబై ఇన్సిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. అలా వడ్డే నవీన్ నాకు పరిచయం" అంటూ తెలిపారు.


ఆ తర్వాత సిమ్రాన్ గురించి మాట్లాడుతూ.. "సిమ్రాన్ అసలు పేరు రిషిబాల. ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. మేము ముగ్గురం ముంబై ఇన్సిట్యూట్ లో ఫ్రెండ్స్ అయ్యాం. ట్రైనింగ్ అయిపోయాక ఓ నాలుగు నెలలు నేను అక్కడే ఉన్నాను. ముంబై సిటీ చూడాలి, ముంబైలో ఉండాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అలా నాలుగు నెలలు ఉన్న తర్వాత చెన్నైకి వెళ్లడం సినిమా ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత అలా 'స్వయంవరం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగాయి" అంటూ  తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వేణు.


Also Read : వెంకటేష్ 'సైంధవ్' రిలీజ్‌కు రెడీ - ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్టర్













Join Us on Telegram: https://t.me/abpdesamofficial