Sandhya Theater Stampede Incident Latest Update : అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని థియేటర్ మేనేజ్మెంట్ ఓ నోట్ రిలీజ్ చేసింది.
'ఫేక్ ప్రచారం వద్దు'
కోర్టు ఉత్తర్వుల ప్రకారం... కేసుకు సంబంధించిన అంశాలపై విచారణ సాగుతున్న టైంలో అఫీషియల్ కన్ఫర్మేషన్కు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎలాంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు చెయ్యొద్దని కోర్టు ఆదేశించింది. వాస్తవానికి విరుద్ధంగా డిబేట్స్, వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పబ్లిష్ చేయడం, షేర్ చేయడం వద్దని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియా వేదికలు, ప్రజలు... కోర్టు ఆదేశాలను గౌరవించి ఎలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ థియేటర్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. కేసు తుది తీర్పు వెలువడే వరకూ కోర్డు ఆదేశాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని తెలిపింది.
అసలేం జరిగిందంటే?
2024, డిసెంబర్ 4న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా... ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మూవీ టీం, హీరో అల్లు అర్జున్ బాలుడు శ్రీతేజ్ ఫ్యామిలీకి అండగా నిలిచారు. మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్ సహా తెలంగాణ ప్రభుత్వం వరకూ దాదాపు రూ.3 కోట్లకు పైగా సాయం అందించింది. శ్రీతేజ్కు పూర్తి కార్పొరేట్ వైద్యం అందించగా పూర్తిగా కోలుకున్నాడు. ఎప్పటికప్పుడు అల్లు అరవింద్ ఫ్యామిలీ శ్రీతేజ్ వైద్య పరిస్థితి తెలుసుకుంటూ సాయం అందించారు.
