సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత నటించిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడతో సాయి ధరమ్ తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.


ఆకట్టుకుంటున్న ‘విరూపాక్ష’ హిందీ ట్రైలర్


'విరూపాక్ష' మూవీని మొదట తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ, చివరకు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ రెస్పాన్స్ బాగుంటే, ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ చేద్దామని అనుకున్నారు. తెలుగు వర్షన్ కు అద్భుతమైన స్పందన రావడంతో.. ఇప్పుడు ఈ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ, తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మే 5న ఈ సినిమా హిందీలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అక్కడ ఈ మూవీని గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ  విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ విడుదల చేశారు. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి. తెలుగుతో పోల్చితే హిందీ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.



‘విరూపాక్ష’ సీక్వెల్ కన్ఫార్మ్ చేసిన హీరో, దర్శకుడు


‘విరూపాక్ష’ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోందని హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు కార్తీక్ దండు కన్ఫార్మ్ చేశారు. ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్  అనంతరం నెటిజన్లతో ముచ్చటించారు సాయి ధరమ్ తేజ్. #AskSDT పేరుతో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓ అభిమాని “విరూపాక్ష మూవీ క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చారు పార్ట్2 ఉంటుందా? సాయి ధరమ్ తేజ్ అన్నా ఒకవేళ పార్ట్ 2 ఉంటే మన ఫ్యాన్స్ కి పండుగే” అని ట్వీట్ చేశారు. దీనికి  హీరో రియాక్ట్ అయ్యారు. “ఉంది అనే కదా హింట్ ఇచ్చాం” అని చెప్పుకొచ్చారు. సాయి సమాధానంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు దర్శకుడు కార్తీక్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ ఉంటుందన్నారు. కానీ, వెంటనే రాకపోవచ్చని చెప్పుకొచ్చారు. 


ఇక శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్  'విరూపాక్ష' సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసింది.  బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అదే, సాయి ధరమ్ తేజ్‌కు ప్లస్ అయ్యింది. మొత్తంగా  సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం పట్ల మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ దెబ్బతో సాయి కెరీర్ మళ్లీ గాడిన పడటం ఖాయమని అంటున్నారు. అటు హిందీలోనూ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.






Read Also: ఆ ఆరోపణలను రుజువు చేస్తే రూ. కోటి ఇస్తాం, ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ కు ముస్లిం యూత్ లీగ్ ఆఫర్!