Ram Charan - Upasana: రిలయన్స్‌ గ్రూపు అధినేత ముకేశ్‌ అంబానీ - నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు సందడి చేశారు. అంబానీ ఇంట పెళ్ళికి టాలీవుడ్ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు వెళ్లారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కూడా ఉన్నారు. 


రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహానికి వెళ్లారు. తాజాగా మెగా కపుల్ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో షేర్ చేసారు. "ప్రియమైన అనంత్ - రాధిక, మీ అందమైన ప్రయాణానికి అభినందనలు. మా తరపున శుభాకాంక్షలు. అనంత్, మీ పెద్ద మనసు మా అందరినీ హత్తుకుంది. నీతా జీ, మీరు ఒక కుమార్తెను మీ కుటుంబంలోకి స్వాగతించే భారతీయ సంస్కృతిని ప్రదర్శించిన విధానం.. మిగిలిన వారు అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ముఖేష్ జీ, మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు" అని తన పోస్టులో పేర్కొన్నారు. 






ముంబయిలోని బాంద్రా జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో రామ్ చరణ్ & ఉపాసన దంపతులు అంబానీ ఫ్యామిలీతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక ఫొటోలో చరణ్ - అనంత్‌ అంబానీ ఒకరినొకరు దగ్గరకు తీసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో నూతన వధూవరులతో పాటుగా ముఖేష్ అంబానీ ఉన్నారు. ఇక ముఖేష్ అంబానీకి చెర్రీ అభివాదం చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంట్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. 


RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత, రామ్ చరణ్ కు నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తన ఇమేజ్ ను కాపాడుకునే విధంగా భారీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇందులో తండ్రీకొడుకులుగా చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 


ఇక 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. తాత్కాలికంగా 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 


Also Read: ‘క‌ల్కి 2898 AD’ మూవీకి మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసలు - అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ పోస్ట్