మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సోమవారం రాత్రి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) వెళ్ళారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారు. స్వామి మాలలో అమెరికా వెళ్ళారు. మార్చి 13న ఆస్కార్ (Oscars 2023) ఫలితాలు వెల్లడించనున్నారు. ఎవరు ఎవరు విజేతలుగా నిలిచారు? అనేది ప్రపంచానికి ఆ రోజు తెలుస్తుంది. ఆ కార్యక్రమానికి సుమారు 20 రోజుల ముందు రామ్ చరణ్ అమెరికా వెళ్ళడం విశేషం.
 
అమెరికాలో చరణ్ ఫాలోయింగ్ చూస్తే...
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అవార్డు మన తెలుగు పాటకు రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ (golden globe awards 2023 winners) పురస్కారాల్లో కూడా 'నాటు నాటు...' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.


గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్ళారు. అప్పుడు అక్కడి ప్రేక్షకుల నుంచి ఆయనకు విపరీతమైన స్పందన లభించింది. 'ఆర్ఆర్ఆర్'లో ఆయన నటనకు విశేషాల్లోని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులు సైతం అభిమానులు అయ్యారు. ప్రముఖ హాలీవుడ్ దర్శక - నిర్మాత, 'టైటానిక్' & 'అవతార్' చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడారు. 


రామ్ క్యారెక్టర్ ఛాలెంజింగ్ : జేమ్స్ కామెరూన్
దర్శక ధీరుడు రాజమౌళిని ఆ మధ్య జేమ్స్ కామెరూన్ కలిశారు. 'ఆర్ఆర్ఆర్'పై ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సమయంలో తన మనసులో మాటను చెప్పాలని అనుకున్నప్పటికీ... చెప్పలేకపోయానని లేటెస్ట్ ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ తెలిపారు. ''ఆర్ఆర్ఆర్ అద్భుతమైన సినిమా. తొలిసారి చూసినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. షేక్ స్పియర్ క్లాసిక్ తరహాలో అనిపించింది. సినిమాలోని క్యారెక్టర్లు, వీఎఫ్ఎక్స్, కథను చెప్పిన తీరు క్లాసిక్. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ పాత్ర ఛాలెంజింగ్. రామ్ మనసులో ఏముంది? అనేది తెలిసిన తర్వాత షాక్ అయ్యాను. గుండె బద్దలైంది'' అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు.
 
ఆస్కార్ కూడా చిన్నదే...
తండ్రిగా గర్విస్తున్నా - చిరు
రామ్ క్యారెక్టర్ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడటంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ అయిన ఆయన మాటల ముందు ఆస్కార్ కూడా చిన్నదేనని చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా? అని ఓ తండ్రిగా తాను ఎంతో గర్విస్తున్నానని మెగాస్టార్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.


Also Read : చెర్రీ మనసు దోచిన ఇద్దరు హీరోయిన్లు, ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?


ఇప్పుడు రామ్ చరణ్ అమెరికా వెళ్ళడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఆయనతో ముచ్చటించడానికి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఆ తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. కన్నడ దర్శకుడు నర్తన్ సినిమా చర్చల్లో ఉంది. శంకర్, బుచ్చిబాబు సినిమాల తర్వాత ఆ సినిమా ఉండొచ్చు. 


Also Read : 'శంకరాభరణం', 'బొబ్బిలి పులి' చిత్రాల ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత