Ram Charan Esquire India Interview Highlights : ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్, పిల్లలు, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ నటుడిగా మాత్రమే కాకుండా... తండ్రిగా, భర్తగా తన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో వివరించారు. 

'పిల్లలను మట్టిలో ఆడనిస్తా'

పిల్లలే తన ప్రపంచం అని... షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత వారితో టైం స్పెండ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు రామ్ చరణ్. 'తండ్రి అయిన తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లగానే పిల్లలతో టైం స్పెండ్ చేస్తా. వారి అల్లరి చూస్తూ పక్కనుండి ప్రోత్సహిస్తా. వాళ్లను రిస్కులు తీసుకోనిస్తా. దూకనిస్తూ... మట్టిలో ఆడనిస్తా. వాళ్లు కింద పడినా, ఎత్తుపళ్లాలు ఎక్కినా భయపడను. రిస్క్ తీసుకోవాలని, ధైర్యంగా పెరగాలని కోరుకుంటా.

వాళ్ల అమ్మ ఉపాసన మాత్రం పిల్లలను సున్నితంగా చూసుకుంటుంది. క్లీంకారను ఎప్పుడైన తిడితే నా దగ్గరకు వస్తుంది. వాళ్లకు ఏదైనా సాహసం చేయాలన్నా, ధైర్యం కావాలన్నా నా దగ్గరకు వస్తారు. నా ఫ్యామిలీ, పెంపుడు జంతువులే నా ప్రపంచం. నా పెంపుడు కుక్క రైమ్ కూడా ఆటతో నా అలసట పోగొడుతుంది.' అని చెప్పారు.

Also Read : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్

తండ్రి చెప్పిన మాట...

తన తండ్రి చిరంజీవి వారసత్వంతో పాటు కష్టపడి పని చేసే తత్త్వాన్ని కూడా అందిపుచ్చుకున్నట్లు చెప్పారు చరణ్. అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడు అన్నదే తండ్రి తనకు నేర్పిన సూత్రమని... దాన్నే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఓ నటుడిగా ఉండడమే కాకుండా బాధ్యతలు నిర్వర్తించే తండ్రిగా ఉండడం కూడా తన ఫస్ట్ ప్రయారిటీ అని అన్నారు.

అయ్యప్ప దీక్షతో మార్పు...

అయ్యప్ప దీక్ష తనలో పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు చరణ్. 'మా నాన్న చిరంజీవి సూచనతో 17 ఏళ్ల వయసులో ప్రారంభించిన అయ్యప్ప దీక్ష నా లైఫ్‌లో క్రమశిక్షణ పెంచింది. నా ఆలోచనలు నియంత్రించడానికి ఉపయోగపడింది. అనవసర విషయాలకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతత పొందడానికి సహాయపడుతుంది.' అని అన్నారు. హాంకాంగ్‌లో ఓ విలాసవంతమైన హోటల్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పుల్లేకుండా నడిచి చరణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడు ఆయన అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. 

పెద్ది... ఏడాదిన్నర కఠోర శిక్షణ

తన రాబోయే మూవీ పెద్ది కోసం చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు చరణ్. 'పెద్దిలో పవర్ ఫుల్ రోల్ కోసం ఏడాదిన్నరగా కఠోర శిక్షణ తీసుకున్నా. ఇలాంటి పాత్రల్లో ఫిట్‌గా కనిపించడం ముఖ్యం. సుల్తాన్, దంగల్ వంటి మూవీస్‌కు పని చేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకున్నా. 'ఆర్ఆర్ఆర్'తో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు నాపై బాధ్యత పదింతలు పెంచింది. మనం కేవలం సినిమాను మాత్రమే కాదు. మన సంస్కృతిని ప్రపంచానికి చెబుతున్నాం. అందుకే ప్రతీ షాట్‌లోనూ నిజాయతీగా నటించాల్సి ఉంటుంది.' అని అన్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తోన్న పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.