Ram Charan As Brand Ambassador For Archery Premier League: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ఫస్ట్ టైం జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ మేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (AAI) గురువారం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్‌ జరగనుంది. దీనిపై చరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ టాప్ ఆర్చర్లతో సహా...

ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా జరుగబోతున్న ఈ టోర్నీలో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లు ఒకే చోటుకు చేరనున్నారు. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడంతో పాటు భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీల్లో 36 మంది భారత టాప్‌ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడనున్నారు. వీరిలో కొంతమంది ప్రపంచంలో టాప్ 10లో ఉన్నవారే. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్‌ ఫార్మాట్‌ ద్వారా ఆర్చర్లురికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీ పడనున్నట్లు తెలిపారు.

అందుకు సిద్ధంగా ఉన్నా

భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తి నింపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్ చరణ్ (Ram Charan) తెలిపారు. 'ఆర్చరీ అనే క్రీడ.. క్రమశిక్షణ, ఫోకస్ కలిగి ఉంటుంది. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌ లైట్‌లోమెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నా.' అని పేర్కొన్నారు.

Also Read: రోడ్ టర్నింగ్‌లో దెయ్యం మిస్టరీ... ఓటీటీలోకి సూపర్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దేశంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఏపీఎల్ (APL) వేదికగా ఉపయోగపడనుందని జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండా అన్నారు. 'ఏపీఎల్‌ ద్వారా వారి భవిష్యత్‌ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు అవకాశం లభిస్తుందన్న గట్టి నమ్మకం మాకుంది. దీనికి తోడు ఆర్చరీని మరో స్థాయిని తీసుకెళ్లేందుకు ఈ లీగ్‌ దోహదం చేస్తుంది. రామ్‌చరణ్బ్రాండ్‌ అంబాసీడర్‌గా దేశంలోని మరింత మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.' అని చెప్పారు.

దేశంలోని మిగతా లీగ్స్ నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్చరీ లీగ్ ఏర్పాటు చేసినట్లు ఏఏఐ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సచ్ దేవా తెలిపారు. ఇందులో ప్రొఫెషనల్‌ స్థాయికి తగట్లు లీగ్‌ నిర్వహిస్తామని అన్నారు. 'ఇది కేవలం లీగ్‌ కాదు, భారత ఒలింపిక్‌ స్వప్నాన్ని చేరుకునేందుకు ఒక మెట్టుగా మారనుంది. రామ్‌చరణ్‌ ఎంపిక ద్వారా లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది.' అని అన్నారు.