Priyanka Mohan about OG: ఈమధ్య చాలామంది యంగ్ హీరోయిన్స్.. ఎక్కువ సినిమాల్లో అనుభవం లేకపోయినా స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఆ లిస్ట్‌లో ప్రియాంక మోహన్ కూడా యాడ్ అయ్యింది. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్‌’ చిత్రంతో పరిచయమయిన భామ.. అక్కడి నుండి మొదలయ్యి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఓజీ’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించాలి అనుకుంది ప్రియాంక మోహన్. అందులో ఎక్కువగా తనకు ‘ఓజీ’ గురించే ప్రశ్నలు ఎదురవ్వగా సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చింది.


ఒక గొప్ప నాయకుడు..


ఒక స్టార్ హీరోతో ఓ హీరోయిన్ సినిమా చేస్తుంది అని తెలియగానే వారి ఫ్యాన్స్ అంతా హీరో గురించి తమ అభిప్రాయం చెప్పమని అడుగుతూ ఉంటారు. ప్రియాంక మోహన్‌ను కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడగగా.. ‘పవన్ కళ్యాణ్ ఒక లెజెండ్. ఒక మంచి మనిషి. అంతే కాకుండా ఒక గొప్ప నాయకుడు’’ అని తెలిపింది ప్రియాంక. ‘ఓజీ’ గురించి ఏమైనా చెప్పమని అడగగా.. ‘‘ఓజీ చాలా బాగా వస్తుంది. మీరంతా ఈ మ్యాజిక్‌ను వెండితెరపై చూసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’’ అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ.. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తూ మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కానున్నాడు.


మళ్లీ ఆ హీరోతోనే..


పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రియాంక మోహన్ ‘ఓజీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అది కాకుండా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పమని ఫ్యాన్స్ అడగగా.. ‘ఓజీ, సరిపోదా శనివారం, బ్రదర్’ అని రివీల్ చేసింది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘సరిపోదా శనివారం’. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ సినిమా విషయంలో తనకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది. వీటితో పాటు తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు తను సమాధానమిచ్చింది. ‘‘శుభ్రమైన ఆహారం తినాలి, హైడ్రోటెడ్‌గా ఉండాలి. వ్యాయామం చేయాలి. ఇవి కాకుండా నేను ఎక్కువగా బేసిక్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తాను. క్లీన్సర్, మాయిశ్చరైజర్, సన్‌బ్లాక్ ఉపయోగిస్తాను’’ అంటూ తన స్కిన్ కేర్ రొటీన్‌ను షేర్ చేసుకుంది. 


అయిదు భాషలు వచ్చు..


ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది ప్రియాంక మోహన్. అందుకే మొత్తంగా తనకు ఎన్ని భాషలు వచ్చు అని అడగగా.. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్, హిందీ’’ అని సమాధానమిచ్చింది. ఇక మరో ఫ్యాన్ తన గోర్లు బాగుంటాయని, ఒకసారి పోస్ట్ చేయండి ప్లీజ్ అంటూ వింత కోరిక కోరాడు. నిజంగానా అంటూ తన చేతివేళ్శను ఫోటో తీసి పోస్ట్ చేసింది ప్రియాంక. ఇక ఈ భామ చివరిగా ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కెప్టెన్ మిల్లర్’లో హీరోయిన్‌గా కనిపించింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల ఓటీటీలో విడుదలయిన ‘కెప్టెన్ మిల్లర్’కు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.


Also Read: ‘కల్కి 2898 AD’ టైటిల్ అందుకే పెట్టాం - అసలు కథ చెప్పేసిన నాగ్ అశ్విన్