హీరోలను విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ మధ్య గొడవలు సర్వసాధారణం. భారతీయ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఫ్యాన్ వార్స్ కూడా ఒక భాగమని అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు థియేటర్ల వద్ద కొట్టుకునే అభిమానులు.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఇతర హీరోలపై అసభ్యకరమైన కామెంట్స్, అభ్యంతరమైన పోస్టులతో ఒకరినొకరు కించపరుచుకుంటూ వస్తున్నారు. అయితే హీరోలపై మితిమీరిన అభిమానం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అది కూడా ఒక వాట్సాప్ స్టేటస్ కు సంబంధించి వివాదం చెలరేగడంతో, ఓ హీరో ఫ్యాన్ మరో హీరో ఫ్యాన్ ను చంపేయడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. 

 

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన హరి కుమార్, కిషోర్ అనే ఇద్దరు పెయింటర్లు పని మీద మూడు రోజుల క్రితం అత్తిలి వెళ్ళారు. హీరో ప్రభాస్ అభిమాని అయిన హరి తన వాట్సాప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియోని పోస్ట్ చేసాడు. అయితే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన కిషోర్.. ప్రభాస్ వీడియో తీసేసి, తన ఫేవరేట్ హీరో వీడియోలను స్టేటస్ గా పెట్టుకోవాలని హరికి సూచించాడు. దానికి హరి ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో, అర్ధరాత్రి సమయానికి గొడవ మరింత ముదిరి, కొట్టుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది.

 

ఈ క్రమంలో కిషోర్ ను హరికుమార్ ఒక సెంట్రింగ్ కర్రతో తల మీద బలంగా కొట్టాడు. అలానే పక్కనే ఉన్న సిమెంట్ బ్రిక్ తో ముఖం మీద దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన కిషోర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. కిషోర్ చనిపోయిన విషయం అర్థమైన వెంటనే హరి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కిషోర్ బాడీని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు.. హరిని ట్రేస్ చేసి పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

నిజానికి ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలలో ఫ్యాన్ వార్ కాస్త ఎక్కువగానే జరుగుతుంటాయి. హీరోల రికార్డుల గురించి, బాక్సాఫీసు కలెక్షన్స్ గురించి గొడవలు పడుతుంటారు. సినిమాల విడుదల టైమ్ లో రచ్చ చేస్తుంటారు. ఇదంతా అక్కడి వరకే పరిమితం అనుకుంటే, ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చెలరేగిన చిన్న వివాదం.. హత్యకు దారి తీయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. 

 

గతంలో విశాఖపట్నంలో దివంగత హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ ఫ్యాన్స్ మధ్య చెలరేగిన వివాదం.. ఒకరిని హత్య చేసే వరకూ వెళ్ళింది. 2016లో పవన్ కళ్యాణ్ అభిమానిని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కత్తితో పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపింది. ఇప్పుడు లేటెస్టుగా క్షణికావేశంలో పవన్ ఫ్యాన్ ని ప్రభాస్ అభిమాని కొట్టి చంపడం హాట్ టాపిక్ అయ్యింది.

 

ఏదేమైనా తమ ఫేవరేట్ హీరోల కోసం ఈ విధంగా అభిమానులు ఒకరినొకరు కొట్టుకుని చంపుకోవడం దారుణమైన విషయం అనే చెప్పాలి. ఇలాంటి అవాంఛనీయమైన ఘటనలను ఎవరూ ఎంకరేజ్ చేయరు. అభిమానం అనేది సినిమా వరకూ ఓకే కానీ.. ఇలా భౌతిక దాడులకు దిగడం, హత్య చేసే వరకూ వెళ్ళడం శోచనీయం. ఇకనైనా ఫ్యాన్స్ అభిమానం పేరుతో హద్దులు మీరకుండా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు.