O Romeo Movie Controversy: మా నాన్న గ్యాంగ్స్టర్ కాదు... జర్నలిస్ట్ - షాహిద్ 'ఓ రోమియో'పై కోర్టుకు వెళ్లిన లేడీ
O Romeo Movie Release Date: ఫిబ్రవరి 13న విడుదల కానున్న బాలీవుడ్ సినిమాల్లో షాహిద్ కపూర్ 'ఓ రోమియో' ఒకటి. ఈ సినిమా మీద ఒకరు కోర్టుకు వెళ్లారు. ఆ వివాదం ఏమిటో తెలుసుకోండి.

ఫిబ్రవరి 13న విడుదల కానున్న బాలీవుడ్ సినిమా 'ఓ రోమియో'. ఇందులో షాహిద్ కపూర్ హీరో. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో ఆయన భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తరహా హిట్ 'ఓ రోమియో' వస్తుందని హిందీ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే... సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి షాక్ తగిలింది. ఈ సినిమా మీద ఒకరు కోర్టుకు వెళ్లారు. ఆ వివాదం, పూర్తి వివరాల్లోకి వెళితే...
'ఓ రోమియో' సినిమా విడుదలకు వ్యతిరేకంగా హుస్సేన్ 'ఉస్త్రా' షేక్ కుమార్తె సనోబర్ షేక్ కోర్టుకు వెళ్లారు. ఫిబ్రవరి 2వ తేదీన బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా & 'ఓ రోమియో' విడుదలకు వ్యతిరేకంగా శాశ్వత నిషేధం (ఇంజంక్షన్) కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో తన తండ్రి జీవితాన్ని వక్రీకరించారని ఆమె ఆరోపించారు.
ఏబీపీ న్యూస్తో సనోబర్ షేక్ మాట్లాడుతూ... చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్, జర్నలిస్ట్ - రైటర్ హుస్సేన్ జైదీలపై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు సనోబర్ షేక్ తెలిపారు.
'ఓ రోమియో' సినిమాలో అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారని సనోబర్ షేక్ ఆరోపించారు. అంతే కాదు... ముంబైలోని జె.జె. మార్గ్ పోలీస్ స్టేషన్లో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ 'ఉస్త్రా' పాత్ర పోషిస్తున్నారు. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

తన తండ్రి కథతో 'ఓ రోమియో' తీశారని, ఆయనను 'గ్యాంగ్స్టర్'గా చూపించారని సనోబర్ షేక్ ఆరోపించారు. తన తండ్రి గ్యాంగ్స్టర్ కాదని, అండర్ వరల్డ్ను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు పోలీసులకు బోల్డంత సమాచారం అందించిన జర్నలిస్ట్ అని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి ప్రెస్ ID కార్డును చూపించడంతో పాటు ఆధారాలు సమర్పించారు.
Also Read: Shalini Pandey: బికినీలో షాక్ ఇచ్చిన బ్యూటీ... మరోసారి 'అర్జున్ రెడ్డి' బ్యూటీ సెన్సేషనల్ పోస్ట్

'ఓ రోమియో' సినిమా విడుదల అయితే తమ కుటుంబానికి, తమ పిల్లలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని సనోబర్ షేక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11, 1998న హుస్సేన్ ఉస్త్రాను చోటా షకీల్ ముఠా హత్య చేసిందని, తన తండ్రి శరీరంలో 11 బుల్లెట్లు ఉన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆమె ఆరోపణలను సాజిద్ నడియాడ్వాలా, విశాల్ భరద్వాజ్ ఖండించారు. తమ సినిమా పూర్తిగా కల్పిత కథతో రూపొందిందని చెప్పారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానున్న 'ఓ రోమియో' సినిమాలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి, నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, దిశా పటాని, ఫరీదా జలాల్, విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు.























