గత కొంతకాలంగా సినీ అభిమానులను బాగా అలరిస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షోకు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమలకు సంబంధించిన నటీ నటులను ఆహ్వానిస్తున్నారు నిర్వహకులు. తెలుగు నుంచి కూడా పలువురు స్టార్స్  పాల్గొన్నారు. హోస్ట్ కరణ్ అడిగే ప్రశ్నలు ఆడియెన్స్ ను బాగా అలరిస్తాయి. సెలబ్రిటీలు చెప్పే వ్యక్తిగత విషయాలతో పాటు  సినీ కెరీర్ కు సంబంధించిన అంశాలు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తాయి. ఇప్పటి వరకు ఈ షో 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 8వ సీజన్ టెలీకాస్ట్ అవుతోంది. తాజా సీజన్ లో పాల్గొనాల్సిందిగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నానికి ‘కాఫీ విత్ కరణ్’ షో నిర్వాహకులు ఆహ్వానం పంపించారట. కానీ, ఆయన రాలేనని చెప్పారట.


బాలీవుడ్ అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా- నాని


వాస్తవానికి ఈ షోలో పాల్గొనాలని చాలా మంది నటీనటులు భావిస్తారు. ఈ షో తమ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని ఆశపడే వారు కూడా ఉన్నారు. ఈ షోలో పాల్గొంటే బాగా పాపులర్ కావడంతో పాటు నేషనల్ రేంజిలో గుర్తింపు దక్కుతుంది అనుకుంటారు. కానీ, ఆ షోలో పాల్గొనడం తనకు ఇష్టం లేదంటున్నారు నటుడు నాని. రీసెంట్ గా ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. సౌత్ లో రాణిస్తున్న తాను బాలీవుడ్ లోనూ అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇకపై తాను నటించే సౌత్ సినిమాలను బాలీవుడ్ లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.   


ఆ షోలో పాల్గొనను- నాని


ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ గురించి కూడా నాని ప్రస్తావించారు. ఆయన తనకు ఫోన్ చేస్తుంటారని చెప్పారు. అయితే, ఆయనను కలిసే సందర్భం రాలేదన్నారు. వస్తే కచ్చితంగా కలుస్తానని చెప్పారు. కరణ్  హోస్ట్ చేసే షోలో పాల్గొంటారా? అనే ప్రశ్నకు నాని ఆసక్తికర సమాధానం చెప్పారు. “ఆయన కలిస్తే హ్యాపీగా సినిమా ముచ్చట్లు చెప్పుకుంటాను. కానీ, కెమెరా ముందు తనతో కలిసి మాట్లాడేది లేదు” అంటూ నవ్వారు. నిజానికి కరణ్ తన షోలో పాల్గొన్న గెస్టులకు సంబంధించిన కాంట్రవర్సీ విషయాలను ప్రస్తావిస్తారు. పాత విషయాలను మళ్లీ గుర్తు చేస్తుంటారు. అందుకే, ఆయన షోకు వెళ్లేందుకు చాలా మంది సెలబ్రిటీలు ఆసక్తి చూపించరు.  


డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ విడుదల


అటు నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బేబీ కియారా కన్నా ఇందులో నాని కుమార్తెగా కనిపించనుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial