VeeraSimha Reddy pre-release event Venue changed : నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహరెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదిక మారనుంది. ముందుగా నిర్ణయించినట్లుగా ఒంగోలు ఏబియం గ్రౌండ్ లో ఈ నెల 6న ప్రి రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. నగరం మధ్యలో ఎలాంటి ఈవెంట్ జరపడానికి వీల్లేదని అధికారులు, పోలీసులు వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించారు. 


కారణాలు ఏంటంటే ?


నగరం మధ్యలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే.. స్థానికంగా ఉండే అభిమానులతో పాటు పక్క జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలో భాగంగా వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక మార్చుకోవాలని మూవీ యూనిట్‌కు సూచించినట్లు సమాచారం. దాంతోపాటు నగరం మధ్యలో ఈవెంట్ నిర్వహిస్తే ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అధికారుల నుంచి ఈవెంట్ కు పర్మిషన్ రాకపోవడంతో వీరసింహరెడ్డి మూవీ యూనిట్ ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.


మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 6వ తేదీన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఒంగోలు నేపథ్యంలోనే ‘వీర సింహారెడ్డి’ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. ఈ ప్రీ రిలీజ్ ను గ్రాండ్ గా చేసేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక మూవీ యూనిట్‌కు తలనొప్పులు మొదలయ్యాయి. నగరం మధ్యలో కాకుండా సిటీ బయట ప్రత్యామ్నాయ వేదికలో ఈవెంట్ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.


అఖండ తరువాత బాలయ్య నటిస్తున్న మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 


జీవో 1 ఎఫెక్ట్.. సినిమాల ఫంక్షన్లపై ప్రభావం ! 
సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ ఈవెంట్లపై ఏపీలో జీవో నెం.1 ఎఫెక్ట్ పడింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో 1 కారణంగానే శుక్రవారం ఒంగోలులో నిర్వహించాల్సిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. నగరం మధ్యలో కాకుండా సిటీ బయట ప్రత్యామ్నాయ వేదికను మార్చుకోవాలని మూవీ యూనిట్‌కు సూచించారు. ఈ క్రమంలో జనవరి 8న విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహణ పై ఉత్కంఠ నెలకొంది.