స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. కొంత మంది ఏకంగా సుప్రీకోర్టు తలుపు తట్టారు. సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను చట్టబద్దంగా గుర్తించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రీసెంట్ గా ఈ కేసుపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్వలింగ సంపర్కుల  వివాహానికి చట్టబద్దత కల్పించేందుకు నిరాకరించింది. అయితే, వారు సహజీవనం చేసుకునే హక్కు ఉందని తెలిపింది. స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపించకూడదని తెలిపింది. వారి హక్కులను పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


సుప్రీం తీర్పుపై మంచు లక్ష్మి అసంతృప్తి


సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై నటి మంచులక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తీర్పు తనకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొంది. “సేమ్ జెండర్ వివాహాలకు సుప్రీంకోర్టు చట్టబద్దత కల్పించలేమని చెప్పడం నాకు తీవ్ర నిరాశనకు కలిగించింది. నా గుండె పగిలేలా చేసింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజంగా అవమానం. ఇతర దేశాల్లో ఎవరికి వారు స్వేచ్ఛగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. మన దేశంలో సేమ్ జెండర్ మ్యారేజెస్ ను అంగీకరించలేమా?” అని మంచు లక్ష్మి ప్రశ్నించారు.  






స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?


స్వలింగ సంపర్కుల వివాహాలపై  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల పాటు విచారణ జరిపింది. ఈ అంశానికి సంబంధించిన నాలుగు తీర్పులు వెల్లడించింది. ఇందులో స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా పలు అంశాలు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం సేమ్ జెండర్ జంటలు చేసుకునే పెళ్లిళ్లకు ఎలాంటి గుర్తింపు లేదని అభిప్రాయపడింది. ఈ వివాహాలను గుర్తించేలా చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుకు మాత్రమే ఉందని వెల్లడించింది. అయితే, సేమ్ జెండర్ జంటల హక్కులను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని ఆదేశించింది. వారి పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని వెల్లడించింది. వారి సహజీవనం గురించి ఏవైనా ఫిర్యాదులు అందితే పోలీసులు విచారణ జరిపే హక్కు ఉంటుందని తెలిపింది. అయితే, విచారణ పేరుతో వారిని వేధించకూడదని ఆదేశించింది.


సుప్రీం తీర్పుపై మిశ్రమ స్పందన


సుప్రీంకోర్టు తాజా తీర్పుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ తీర్పుపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు సుప్రీం తీర్పును తప్పుబడుతున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు జీవించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రపంచానికి ప్రేమను బోధించే భారత దేశంలో సేమ్ జెండర్ వివాహాలను అంగీకరించకపోవడం బాధాకరం అంటున్నారు.


Read Also: ‘జవాన్‘ స్టైల్లో షారుఖ్ యాడ్ - రైల్లో బందీలుగా అలియా, రణబీర్ జంట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial