L2 Empuraan Movie Revised Version Cuts: మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో 'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) మార్చి 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీలో కొన్ని సీన్స్ విషయంలో వివాదం నెలకొంది. ఓ వర్గం మనోభావాలను కించపరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, దీనిపై మరోసారి దర్శక, నిర్మాతలు సెన్సార్ బోర్డును ఆశ్రయించారు.

ఆ సీన్స్ కట్.. కొన్ని చోట్ల ఆడియో మ్యూట్

మూవీలో కొన్ని సీన్లకు సంబంధించి సెన్సార్ బోర్డ్ 24 కట్స్ చెప్పింది. కొన్ని పాత్రల పేర్లు మార్చాలని.. కొన్ని విజువల్స్ తీసేయాలని, కొన్ని చోట్ల ఆడియో మ్యూట్ చేయాలని, కొన్ని రీప్లేస్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో సినిమా నిడివి 2 నిమిషాల 8 సెకన్లు తగ్గనుంది. ఈ రివైజ్డ్ వెర్షన్ ఎప్పటి నుంచి థియేటర్లలోకి అందుబాటులోకి వస్తుందనే దానిపై మూవీ టీం వివరాలు వెల్లడించలేదు.

Also Read: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీపై అధికారిక అప్ డేట్ - స్టోరీపై నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!

మూవీలో ఈ పేర్లు మార్పు

సెన్సార్ బోర్డు సూచనల మేరకు సినిమాలో కీలక పాత్ర బాల్‌రాజ్ భజరంగీ పేరును బలదేవ్‌గా మార్చనున్నారు. అలాగే, థ్యాంక్స్ కార్డులోని కేంద్ర మంత్రి సురేశ్ గోపి పేరును తొలగించాల్సి ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు సంబంధించి సీన్స్ మ్యూట్ కానున్నాయి. ఆయా సీన్స్ స్వచ్ఛందంగానే మార్పులు చేయాలనుకున్నట్లు నిర్మాత తెలిపారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని అన్నారు. ఈ వివాదంపై హీరో మోహన్ లాల్ సైతం రెండు రోజుల క్రితం క్షమాపణలు చెప్పారు. వివాదానికి కారణమైన సీన్స్ తొలగిస్తామని తెలిపారు.

మరోవైపు.. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లికా సుకుమారన్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. తన కొడుకును సమర్థించారు. పృథ్వీరాజ్.. మోహన్ లాల్, చిత్ర నిర్మాతలను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. పృథ్వీరాజ్ తమను మోసం చేశాడని మోహన్ లాల్, నిర్మాతలు చెప్పలేదని.. వాళ్లు అలా అంటారని తాను అనుకోనని అన్నారు. తన కొడుకుని బలి పశువును చేయడానికి ప్రయత్నించడం బాధాకరమని చెప్పారు.

ఈ సీన్స్ వల్లే వివాదం

2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో మూవీలో కొన్ని సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొంతకాలానికి అతనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వంటి అంశాలతో ఈ సీన్స్ ఉండగా వాటిపై కొందరు అభ్యంతరం తెలిపారు. ఈ సీన్స్ ఓ వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా అవమానకరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. దర్శకుడు పృథ్వీరాజ్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. 

2019లో వచ్చిన 'లూసిఫర్' మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్ 2: ఎంపురాన్' తెరకెక్కింది. మార్చి 27న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.