Nikhil Karthikeya 2 Movie won National Award: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు సినిమా 'కార్తికేయ 2' ఉత్తమ చిత్రం క్యాటగిరిలో అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 70వ నేషనల్‌ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించగా అందులో మన తెలుగు సినిమాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం విశేషం. ఈ సందర్భంగా కార్తికేయ 2 మూవీ టీం సంబరాలు చేసుకుంటుంది. తమ సినిమా నేషనల్‌ అవార్డు గెలవడంపై ఎంటైర్‌ టీం ఆనందం వ్యక్తం చేస్తుంది.


ఇప్పటికే హీరో నిఖిల్‌ ఆడియన్స్‌కి, తమ చిత్రాన్ని అవార్డుకు ఎంపిక చేసిన నేషనల్‌ కౌన్సిల్‌కి ధన్యవాదాలు తెలిపాడు.ఈ సందర్భంగా తాజా 'కార్తికేయ 2' నిర్మాతలైన టి.జి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, దర్శకుడు చందూ మొండేటి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం తమ సంస్థకు మైల్ స్టోన్ మూమెంట్ అన్నారు. ఇక దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు కార్తికేయ 3పై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. 


ఈ మేరకు డైరెక్టర్‌ మాట్లాడుతూ.. "కార్తికేయ2 అద్భుత విజయం సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యామో ఇప్పుడు కూడా అంతే ఆనందంలో ఉన్నాం. మా సినిమాకు నేషనల్‌ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ నేషనల్ అవార్డ్ మా భాద్యతని మరింత పెంచింది. ఈ సినిమాకు పార్ట్‌ 3 కూడా ఖచ్చితంగా ఉంది. కార్తికేయ 3కి సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్ ఉంది. కార్తికేయ 2 విజయంతో పార్ట్‌ 3పై అంచనాలు మరింత పెరిగాయి. దానిని దృష్టిలో ఉంచుకుని ఆడియన్స్‌ అంచనాలకు తగ్గట్టుగా కార్తికేయ3ని తీసుకువస్తాం. నేషనల్ అవార్డ్ రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. థాంక్స్‌ టూ జూరీ మెంబర్స్. జై శ్రీకృష్ణ" అంటూ చెప్పుకొచ్చారు. 


నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. "కార్తికేయ2 సినిమాకి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థ పీపుల్ మీడియాఫ్యాక్టరీకి మైల్ స్టోన్ మూమెంట్. ఇది మా మొదటి నేషనల్ అవార్డ్. అభిషేక్‌ అగర్వాల్‌కి ఇది రెండో నేషనల్‌ అవార్డు. ఈ సందర్భంగా నేను హీరో నిఖిల్ కి థాంక్స్ చెబుతున్నాను. నిఖిలే డైరెక్టర్ చందూ మొండేటిని మాకు పరిచయం చేశారు. 'కార్తికేయ2' అభిషేక్, మేము కలసి చేసిన సినిమా. కార్తికేయ2 మొదలుపెట్టినప్పుడే పెద్ద సినిమా అనుకున్నాం. కానీ ఇంత సక్సెస్ వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో  ఆడియన్స్ మా సినిమాను ఆదరించారు.



ఈ రోజు మా సినిమాకు ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. మా సంస్థకు ఇది చాలా గొప్ప విషయం. కార్తికేయ3 డెఫినెట్‌గా ఉంటుంది" అని పేర్కొన్నారు.  నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. "కృష్ణ ఈజ్ ట్రూత్. ఈ రోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డ్ కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమాలన్నింటిని సపోర్ట్ చేస్తున్నారు. హీరో నిఖిల్, చందూ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, వారితో మా కొలాబరేషన్ కొనసాగుతుంది" అంటూ కార్తికేయ 3పై హింట్‌ ఇచ్చారు.


Also Read: రామ్ చ‌ర‌ణ్ రియల్ హీరో - మెగా హీరోపై ఫ్రెంచ్ న‌టుడు బ్రావో ప్ర‌శంస‌లు