మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwararao) ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరావు' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో ప్రెజెంట్ హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు రవితేజ. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది 'రావణాసుర'(Ravanasura) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.


'రావణాసుర' వంటి ప్లాప్ తర్వాత రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో నిర్వహించి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే సినిమా నిడివి మూడు గంటలు ఉండడంతో ఈ విషయంలో ఆడియన్స్ కొంత ఆసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో అప్రమత్తమైన మూవీ టీం కొన్ని రోజుల తర్వాత సినిమా నిడివి తగ్గించడంతో 'టైగర్ నాగేశ్వరావు' మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.


తెలుగు రాష్ట్రాల్లో తప్పితే హిందీ తో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ మూవీని త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ నెలలో ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ సినిమా రిజల్ట్ కారణంగా కాస్త ముందుగానే విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'టైగర్ నాగేశ్వరరావు' స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. 'టైగర్ నాగేశ్వరావు' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సుమారు రూ.15 కోట్లకు దక్కించుకుంది.


ఈ క్రమంలోనే నవంబర్ 24న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు మిగతా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం రవితేజ 'ఈగల్'(Eagle) అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.


Also Read : మన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial