Ramoji Rao Death: ఒకరిలో ఉన్న టాలెంట్‌ను గుర్తించడం అంత మామూలు విషయం కాదు. కానీ అలాంటి టాలెంట్ ఎక్కడ ఉన్నా దానిని గుర్తించడంలో రామోజీ రావు ముందుండేవారు. ఆయన హీరోలుగా, హీరోయిన్లుగా, టెక్నీషియన్లుగా, సింగర్స్‌గా పరిచయం చేసినవారు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. వారంతా ఇప్పటికీ రామోజీ రావు వల్లే ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటారు. రామోజీ రావు స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. సీనియర్ ఎన్‌టీఆర్ వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్‌టీఆర్ దగ్గర నుంచి తన పాటతో ఆస్కార్ సాధించిన కీరవాణి వరకు ఇలా ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామోజీ రావు.


ఎన్‌టీఆర్ తొలి సినిమా..


తన తాత ఎన్‌టీఆర్ పేరు పెట్టుకొని నందమూరి కుటుంబం నుంచి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్‌టీఆర్. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తర్వాత ‘నిన్ను చూడాలని’ అనే మూవీతో ఎన్‌టీఆర్‌ను హీరోగా మార్చారు రామోజీ రావు. ఆయన స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లోనే ఈ మూవీని నిర్మించారు. చాలా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని అందరికీ దూరమయిపోయిన ఉదయ్ కిరణ్‌ను హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీ రావే. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఉదయ్ కిరణ్.. ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకోవడానికి ఉషా కిరణ్ మూవీస్ కీలక పాత్ర పోషించింది. ‘చిత్రం’ మూవీతో ఉదయ్‌కు లైఫ్ ఇచ్చింది.


టాలీవుడ్ టు బాలీవుడ్..


రామోజీ రావు ఇండస్ట్రీకి పరిచయం చేసిన చాలామంది హీరోయిన్లు.. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో జెనీలియా, శ్రేయా కూడా ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత వీరిద్దరూ బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నటీమణులుగా మారారు. ‘ఇష్టం’ మూవీతో శ్రేయా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వగా.. ‘తుజే మేరీ కసమ్’ (తెలుగులో ‘నువ్వే కావాలి’ మూవీ)తో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. మంచి నటిగా గుర్తింపు పొందింది. తన ఫస్ట్ మూవీలో నటించిన హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. అన్నట్టు.. రితేష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా రామోజీరావే.


తరుణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ కూడా రామోజీ రావుకే దక్కుతుంది. తరుణ్ ఉషా కిరణ్ మూవీస్‌లో బాల నటుడిగా కూడా నటించాడు. ఆ తర్వాత అతడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను కూడా రామోజీరావే తీసుకున్నారు. ‘నువ్వే కావాలి’ సినిమాతో తరుణ్‌కు టాలీవుడ్‌లో లైఫ్ ఇచ్చారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీకాంత్‌ను కూడా హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. అథ్లెట్‌గా ఉన్న అశ్వినీ నాచప్పను నటిగా వెండితెరపై వెలిగేలా చేశారు. యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయినా కూడా సుధాచంద్రన్‌లో కాన్ఫిడెన్స్ నింపి ఆమెకు నటిగా, డ్యాన్సర్‌గా గుర్తింపు దక్కేలా చేశారు.


డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు..


నటీనటులను మాత్రమే కాదు ఆయన బ్యానర్ ద్వారా, షోల ద్వారా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్‌ను కూడా టాలీవుడ్‌లోకి తీసుకొచ్చారు రామోజీ రావు. ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు పాటతో ఆస్కార్ కొట్టిన కీరవాణి.. ముందుగా ఉషా కిరణ్ మూవీస్‌లోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతే కాకుండా దర్శకుడు తేజను నమ్మి ఆయనను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు ఆయన సినిమాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మించారు. ‘పాడుతా తీయగా’ అనే షో ద్వారా దాదాపు 24 ఏళ్ల నుంచి ఎంతోమంది సింగర్స్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేశారు. ఈ షోలో పాల్గొనే పిల్లలంతా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి లెజెండరీ సింగర్స్ ద్వారా చాలా నేర్చుకునేలా చేశారు.


Also Read: లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ - సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?