Chiranjeevi Shocking comment's on Sye Raa Narasimha Reddy : 'ఖైదీ నెంబర్ 150' తో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాలతో 2019లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా మాత్రం కొన్నిచోట్ల నష్టాలు కూడా వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


'సైరా' వల్ల భారీగానే నష్టపోయాం


మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సైరా నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.. "ఇన్నేళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను. చాలా సినిమాల్లో నటించాను. కానీ వాటిలో కొన్ని నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఫలానా పాత్ర చేయాలని ఎదురు చూస్తే ప్రతిసారి ఆ పాత్ర మనకు రాదు. నాకు స్వాతంత్ర సమరయోధుడిగా నటించాలని కోరిక. చాలా ఏళ్లుగా ఉండేది. అది సైరా సినిమాతో తీరిపోయింది. రామ్ చరణ్ ఖర్చులో రాజీ పడకుండా 200 కోట్లతో ఆ సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా మెప్పించలేకపోయింది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో బాగానే ఆడింది. దాంతో సైరా వల్ల భారీగానే నష్టపోయాం" అని అన్నాడు.


ఆ సినిమా వల్ల నా తమ్ముడు నష్టపోయాడు


నేను గతంలో 'రుద్రవీణ' అనే సినిమా చేశాను. ఆ సినిమాని నా తమ్ముడు నాగబాబు నిర్మించాడు. సినిమాకి గొప్ప పేరు వచ్చింది. కానీ డబ్బులు మాత్రం రాలేదు. దానివల్ల నిర్మాతగా నా తమ్ముడు నష్టపోయాడు. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే నిర్మాత జేబు కాళీ అవుతుంది. అందువల్లే వాళ్ల మేలు కోసం కమర్షియల్ సినిమాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. నిర్మాతల బాగోగులు దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. వ్యక్తిగతంగా వైవిధ్యమైన సినిమాలు చేయాలనుంటుంది. కానీ కమర్షియల్ గా వర్కౌట్ కావు" అని చెప్పుకొచ్చాడు.


'విశ్వంభర' షూటింగ్ ఎక్కడ జరుగుతుంది?


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ మెగాస్టార్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ప్రముఖ టీవీ ఛానెల్ లో 'సలార్' - టెలికాస్ట్ ఎప్పుడంటే?