Central Government Warning To OTT Platforms: ఆడియన్స్‌కు ఎల్లప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ఓటీటీ ప్లాట్ ఫాంలకు (OTT Platforms) కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్‌లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ఓటీటీలు, సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. పిల్లలకు 'ఏ' రేటెడ్ కంటెంట్ (A Rated Content) అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఓటీటీ ప్లాట్ ఫాంలు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై వరుస ఫిర్యాదులు అందాయి. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు తప్పనిసరిగా పాటించాలి. ఈ రూల్స్ బ్రేక్ చేసి ఎలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయకూడదు. వయస్సు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలి. స్వీయ నియంత్రణ కలిగిన ఓటీటీలు ఎథిక్స్ పాటించాలి.' అని ప్రకటనలో పేర్కొంది.

యూట్యూబర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ఇటీవల 'ఇండియాస్ గాట్ టాలెంట్' (IGL) కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారంపైనా ప్రశ్నలు వేశాడు. దీంతో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా.. పలువురు పార్లమెంట్ సభ్యులు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమయ్ రైనా షోలో రణ్‌వీర్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై రణ్‌వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు అన్నింటినీ క్లబ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read: 'శివంగి'గా ఆనంది ఫస్ట్ లుక్ - లుంగీ కట్టుకుని నుదిటిపై విభూతితో డిఫరెంట్‌గా పవర్ ఫుల్ లేడీ

దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం అతని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలికొదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా.? అంటూ ప్రశ్నించింది. 'పేరెంట్స్ సెక్స్'పై వ్యాఖ్యలు అతని వక్రబుద్ధిని సూచిస్తున్నాయని తెలిపింది. పాపులారిటీ కోసం సామాజిక విలువలను దాటి మాట్లాడేందుకు ఎవరకీ అనుమతి లేదని స్ఫష్టం చేసింది. రణ్‌వీర్ వ్యాఖ్యలు యావత్ సమాజం సిగ్గుపడేలా చేశాయని పేర్కొంది. సమాజంలో కొన్ని విలువలను అందరూ పాటించాలని వివరించింది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకునే ఆలోచన ఉందా.? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది.

Also Read: ఏకంగా రెహమాన్‌తోనే సాంగ్.. గూస్ బంప్స్ తెప్పించేసింది - 'ఛావా'తో ఊహించని పాపులారిటీ, అసలు ఎవరా సింగర్?