Arijit Singh announces retirement from playback singing:  బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ తన సంగీత ప్రయాణంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆయన, ఇకపై సినిమా పాటలకు  స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు సమాచారాన్ని తెలియజేస్తూ.. "నేను ముగింపు పలుకుతున్నాను" (I am calling it off) అని పేర్కొన్నారు.

Continues below advertisement

అరిజిత్ సింగ్ తన పోస్ట్‌లో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ,  గడిచిన ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్‌గా నేను ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేదా అసైన్‌మెంట్లు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది, దేవుడు నాపై ఎంతో కరుణ చూపాడు అని రాసుకొచ్చారు. 

అయితే, సినిమాల్లో పాడటం మానేసినా, సంగీత ప్రపంచానికి దూరం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒక చిన్న కళాకారుడిగా సంగీతం గురించి మరిన్ని విషయాలు నేర్చుకుంటానని, సొంతంగా స్వతంత్ర సంగీతాన్ని రూపొందిస్తానని ఆయన వెల్లడించారు.  నేను సంగీతం చేయడం ఆపను, కానీ సినిమా పాటల నుంచి తప్పుకుంటున్నాను అని ఆయన వివరణ ఇచ్చారు.

ప్రస్తుతానికి ఆయన ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తానని అరిజిత్ తెలిపారు. కాబట్టి ఈ ఏడాది ఆయన పాడిన కొన్ని పాటలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బాధ్యతలు పూర్తయిన తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరమై, తన వ్యక్తిగత సంగీత ప్రయాణంపై దృష్టి సారించనున్నారు.            

బాలీవుడ్‌లో 'ఆషికీ 2' సినిమాలోని 'తుమ్ హీ హో' పాటతో సంచలనం సృష్టించిన అరిజిత్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో కూడా 'మనం', 'స్వామిరారా' వంటి చిత్రాల్లో పాటలు పాడి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుల్లో ఒకరైన అరిజిత్, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించడం సంగీత పరిశ్రమను, ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.