Gayatri Gupta sensational comments on Baby Director Sai Rajesh: గతేడాది రిలీజైన బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆనంద్‌ ప్రధాన పాత్రలో సాయి రాజేష్‌ దర్శకత్వంలో  చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీకి ఊహించని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చింది. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దగ్గర దగ్గర వంద కోట్ల వరకు వసూళ్లు చేసింది.  రిలీజ్‌ తర్వాత ఈ సినిమా వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే.


బేబీ కథ తనదేనని, డైరెక్టర్‌ సాయి రాజేష్‌ తన కథను దొంగలించాడంటూ షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ , సినిమాటో గ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ ఆరోపించారు. అంతేకాదు కొద్ది రోజులుగా దీనిపై అతడు పోరాటం చేస్తున్నాడు. సాక్ష్యాలతో సహా బేబీ లీక్స్‌ పేరుతో బుక్‌ను https://babyleaks2023.blogspot.com/ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాడు. ఇందులో బేబీ కథ అసలు ఎలా పుట్టింది, సాయి రాజేష్‌ ఈ కథను ఎలా దొంగలించాడు, తనని ఎంతలా మోసం చేశాడో అన్ని వివరాలతో సహా ఈ పుస్తక రూపంలో మీడియా ముందు ఉంచారు. 


బేబీ కథ శిరిన్ దే


అయితే ఇప్పుడు ఈ వివాదంలోకి సినీ నటి, ఫిదా ఫేం గాయత్రి గుప్తా స్పందించింది. ఈ సందర్భంగా ఆధారాలతో సహా డైరెక్టర్‌ సాయి రాజేష్‌ ఎలాంటి వాడో వివరించింది. అంతేకాదు సాయి రాజేష్‌ పాము లాంటి వాడని, ఇలాంటి వాడిని ఇండస్ట్రీ నమ్మకూడదంటూ సంచలన కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేసింది. "ఈ రోజు నేను ఇండస్ట్రీలో జరిగిన పెద్ద లీక్‌ స్కాం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అదే బేబీ లీక్స్‌ ఈ సినిమా. దీనిపై మాట్లాడటం అన్ని వివరాలు కూడా మీకు చెప్తాను. నిజానికి బేబీ సినిమా సాయి రాజేష్‌ది కాదు. శిరిన్‌ శ్రీరామ్‌ది. ఈ కథను శిరిన్‌, రాజేష్‌కు చెప్పాడు. రాజేష్‌, శిరిన్‌కి చెప్పలేదు. ఈ మొత్తం వ్యవహరంలో మొదటి నుంచి నేను వారితోనే ఉన్నాను. సాయి రాజేష్‌ తెరకెక్కించిన కొబ్బరిమట్ట సినిమా నుంచి బేబీ కథపై చర్చ జరుగుతున్నాయి. బేబీకి మొదట హీరోయిన్ గా నన్నే అనుకున్నారు" అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 


సాయి రాజేష్ పాములాంటి వాడు


అలాగే "బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్‌ ఈ కథను రాసుకున్నాడు. మొదట హీరోయిన్‌ నేనే. ఆడిషన్‌ కూడా ఇచ్చాను. స్కూల్ డ్రెస్ లో ఆడిషన్ కూడా జరిగింది.  ఇదంతా తీసుకుని శిరిన్‌, నేను సాయి రాజేష్‌ దగ్గరికి వెళ్లాం. ఆయన ఒకే అని కూడా చెప్పాడు. చూద్దాం అన్నారు. కానీ ఆ తర్వాత బేబీ ట్రైలర్‌లో చూసి షాక్‌ అయ్యా. అతను ఇలా ఎలా చేస్తాడని అనిపించింది. అయితే సాయి రాజేష్‌తో తనకు ఇబ్బందులు కొత్తేమి కాదంటూ కొబ్బరిమట్ట మూవీ టైంలోనూ నన్ను చాలా టార్చర్‌ చేశాడు" అంటూ చెప్పుకొచ్చింది. 


ఈ  సినిమాకు నాకు సాయి రాజేష్‌ రూ.3 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ కేవలం రూ.25 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన బ్యాలెన్స్‌ అసలు ఇవ్వలేదు. ఈ విషయంలో నన్ను చాలా టార్చర్‌ పెట్టాడు. అందుకే కొబ్బరిమట్ట మూవీలో నా క్యారెక్టర్‌ సడెన్‌గా మాయమైపోతుంది. కానీ, బేబీ కథను దొంగలించి నమ్మక ద్రోహం చేశాడు. అసలు ఈ బేబీ కథను అనుకుని దాన్ని డెవలప్‌ చేసింది శిరిన్‌. కానీ, సాయి రాజేష్‌ మాత్రం ఆ కథను తానే క్రియేట్‌ చేశానంటూ అబద్ధం చెబుతున్నాడు. నిజానికి ఈసినిమా శిరిన్‌, సాయి రాజేష్‌ ఇద్దరు చేద్దామని చెప్పి చివరికి బడ్జెట్‌ లేదని శిరిన్‌ను తప్పించాడు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఈ సినిమాకు చర్చలు జరిపాడు.


శిరిన్ కి న్యాయం జరగాలి


ఆ సంస్థ చాలా మంచిది కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించలేదు. బేబీ సినిమా కోసం సాయి రాజేష్‌ చాలా చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేశాడు. అమ్మాయిలను చెడ్డగా చూపించి జనాలను థియేటర్లోకి రప్పించుకున్నాడు. అతడి బుద్ది ఎలాంటిదో బేబీ మూవీ పస్ట్‌ పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్‌ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్‌ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్‌ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలని కోరుకుంటున్నా' అని పేర్కొంది.