టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప2'. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు పార్ట్ 2 పై అంచనాలు తారస్థాయికి చేరాయి. ఇక ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న షూటింగ్ వీడియో లీకై సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. గతంలో కూడా పుష్ప సినిమాకు సంబంధించి అనేక లీకులు వచ్చాయి. ఈ లీకులు మూవీ టీం కి పెద్ద తలనొప్పిగా కూడా మారాయి. దీంతో చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు.


తాజాగా అలాంటి ఓ షూటింగ్ వీడియో లీక్ అయింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డు గూడెం లో జరుగుతోంది. అయితే ఈ లొకేషన్ ఓపెన్ ప్లేస్ కావడంతో  షూటింగ్ చూడ్డానికి చుట్టుపక్కల ఊర్లో నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. వారిలో నుంచి ఒకరు షూటింగ్ జరుగుతున్నప్పుడు వీడియో ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియా అంతటా క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇక ఈ వీడియోలో ఎర్రచందనంతో ఉన్న నాలుగు లారీలు నదిలో వెళ్తుంటే, ఆ లారీలను వెనకాల రెండు జీపులు భారీ రేంజ్ లో చేజ్ చేస్తూ వెళుతున్నాయి. ఇక ఈ వీడియోని చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


కాగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుంచి అనూహ్యస్పందన కనపరిచింది. ఈసారి పుష్ప 2 తో పాన్ వరల్డ్ మార్కెట్ పై మేకర్స్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బన్నీ కూడా ఈసారి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ లతో పాటూ సీనియర్ నటుడు జగపతిబాబు పార్ట్ 2 లో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.