మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటించబోతున్నారని వార్తలొచ్చాయి.


ఈ విషయంపై నేషనల్ అవార్డు విన్నర్, టాలెంటెడ్ నటుడు బాబీ సింహా క్లారిటీ ఇచ్చారు. ఆయన కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రీసెంట్ గా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాబీ సింహా. చిరు-బాబీ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు చెప్పారు. 


కానీ అది రెగ్యులర్ విలన్ రోల్ కాదని.. ఆ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని అన్నారు. చిరంజీవి నటించిన 'ఛాలెంజ్', 'ముగ్గురు మొనగాళ్ళు', 'విజేత', 'స్టేట్ రౌడీ' వంటి సినిమాలు చూశానని బాబీ సింహా వెల్లడించారు. 


చిరంజీవి గొప్ప నటుడని.. డాన్స్ లు అద్భుతంగా చేస్తారని అన్నారు. గతంలో రవితేజతో కలిసి 'డిస్కోరాజా' అనే సినిమాలో నటించానని.. ఇప్పుడు #MEGA154తో మరోసారి రవితేజతో కలిసి నటించబోతున్నట్లు చెప్పారు. ఒకట్రెండు వారాల్లో సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉందని.. దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి చిరు సినిమాలో రవితేజ, బాబీ సింహా నటించబోతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. 




తెలుగులో 'పేట', 'స్వామి2' వంటి డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబీ సింహా. రీసెంట్ గా ఆయన నటించిన 'మహాన్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇందులో ఆయన పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు చిరు సినిమాతో ఎలాంటి ఫేమ్ దక్కించుకుంటారో చూడాలి!