బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ కోసం టాస్కుల మీద టాస్కులు పెడుతున్నారు బిగ్ బాస్. ఇప్పటికే నిన్న (అక్టోబర్ 3న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో మొదటి కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఇందులో కంటెస్టెంట్స్ మధ్య, సంచాలకులుగా వ్యవహరించిన కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదాలే జరిగాయి. ఇక నేడు (అక్టోబర్ 4న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో మరో రెండు టాస్కులు జరిగాయి. కానీ అవి మొదటి టాస్క్‌లాగా కాకుండా చాలా ఫన్నీగా సాగిపోయాయి. మొదటి టాస్క్ పూర్తయ్యే సమయానికి శుభశ్రీ, గౌతమ్ జంట లీడ్‌లో ఉన్నారు. వారి తర్వాత స్థానంలో అమర్‌దీప్, సందీప్ జంట ఉండగా.. మూడో స్థానంలో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇక నేడు జరిగిన రెండు టాస్కుల వల్ల జంటలన్నీ దాదాపు సమానమైన స్కోర్‌తో ఉన్నాయి.


దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర..
బిగ్ బాస్ సీజన్ 7లో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్‌కు ఇచ్చిన రెండో టాస్క్.. ‘దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర’. ఈ టాస్కులో యాక్టివిటీ ఏరియాలో నిద్రపోతున్న బిగ్ బాస్ స్నేహితుడిని లేపకుండా, తనకు తెలియకుండా బిగ్ బాస్ వస్తువులను తిరిగి తీసుకురావాలి. సమయానుసారం ఆ వస్తువులు ఏంటి అని క్లూ ఇస్తూ ఉంటారు బిగ్ బాస్. దీని కోసం జంటలు రెండు టీమ్స్‌లాగా విడిపోవాలి. ముందు టీమ్‌లో ప్రియాంక, అమర్‌దీప్, గౌతమ్, తేజ, పల్లవి ప్రశాంత్ యాక్టివిటీ ఏరియాలోకి దొంగతనం కోసం వెళ్లారు. అయితే బిగ్ బాస్ అసలు ఏ వస్తువు తీసుకోవాలో చెప్పకముందే.. కంటెస్టెంట్స్ అంతా తమ చేతికి దొరికిన వస్తువులను సంచిలో వేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో అలా చేయడం వీలులేదు అంటూ పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. అయినా కంటెస్టెంట్స్ వినలేదు.


రెండు టీమ్స్‌గా విడిపోయి..
ముందు టీమ్ వెళ్లి దొంగతనం చేసి యాక్టివిటీ ఏరియా నుంచి బయటికి వచ్చేస్తున్న క్రమంలో పల్లవి ప్రశాంత్ సంచిలో నుంచి ఒక వస్తువు కింద పడిపోయింది. దానిని యావర్ కాజేయబోయాడు. దీంతో యావర్‌కు, ప్రశాంత్‌కు కాసేపు వాగ్వాదం జరిగింది. అదే సమయంలో యావర్ టీమ్‌మేట్ అయిన తేజ దగ్గర నుంచి శుభశ్రీ, గౌతమ్.. వస్తువులను దొంగలించారని చూశారు. దీంతో యావర్ వచ్చి తేజను కాపాడాడు. ఇక దొంగతనం కోసం రెండో టీమ్ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లడానికి సిద్ధమయ్యింది. ఈ టీమ్‌లో శోభా శెట్టి, శుభశ్రీ, సందీప్, యావర్, శివాజీ ఉన్నారు. ముందు వెళ్లిన టీమ్ ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని వారు ఆటను ఆడడానికి ప్రయత్నించారు.


తక్కువ వస్తువులు దొంగిలిస్తేనే విన్నర్..
టాస్క్ ముగిసిన తర్వాత కూడా శోభా శెట్టి.. తేజ దగ్గర నుంచి ఫోన్ దొంగతనం చేసింది. దానిని యావర్ తిరిగి తీసుకోబోతుండగా.. వారి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు చిన్న పిల్లల్లా కలబడ్డాడు. తన పర్సనల్ ప్లేస్‌లో యావర్ చేయి ఉందని ఆరోపించగా.. సందీప్ వచ్చి ఆ చేయి తీయమని యావర్‌కు చెప్పాడు. దీంతో వెంటనే యావర్.. తన చేతిని తీసేశాడు. ఆ తర్వాత శోభా నుంచి యావర్ బలవంతంగా ఫోన్ లాగేసుకున్నాడు. బిగ్ బాస్ టాస్క్ ప్రకారం.. ఆయన చెప్పిన వస్తువులను మాత్రమే దొంగతనం చేసి తీసుకురావాలి. కానీ కంటెస్టెంట్స్ మాత్రం యాక్టివిటీ ఏరియాలో ఉన్న చాలా వస్తువులను అనవసరంగా తీసుకొచ్చారు. దీంతో అనవసరమైన వస్తువులు ఎవరైతే తక్కువగా తెచ్చారో వారిని విన్నర్ చేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారు. అలా పల్లవి ప్రశాంత్, శివాజీ జంటకు మొదటి స్థానంతో పాటు మూడు స్టార్లు దక్కాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న శోభా, ప్రియాంక జంటకు రెండుస్టార్లు, ఆ తర్వాత ఉన్న శుభశ్రీ, గౌతమ్‌లకు ఒక స్టార్ దక్కింది. 


Also Read: రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial