బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు కంటెస్టెంట్స్ మధ్య పవర్ అస్త్రా కోసం పోటీ జరిగింది. ఇక బిగ్ బాస్‌లో పవర్ అస్త్రా అనే అంకం ముగిసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పవర్ అస్త్రాను గెలుచుకున్న సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సైతం తమ అస్త్రాలను తిరిగి బిగ్ బాస్‌కు పంపించేశారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఈ ముగ్గురు పవర్ అస్త్రాలను వెనక్కి ఇచ్చేయడంతో పాటు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదే కెప్టెన్సీ టాస్క్. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్‌ గురించి బిగ్ బాస్ బయటపెట్టారు. దీంతో పవర్ అస్త్రా పోయి.. కెప్టెన్సీ టాస్క్ వచ్చింది అనుకున్నారు ప్రేక్షకులు.


ఇద్దరు కంటెస్టెంట్స్ ఒక టీమ్‌గా..
ప్రస్తుతం హౌజ్‌లో ఎవరూ హౌజ్‌మేట్స్ కాదు.. అందరూ కంటెస్టెంట్స్ మాత్రమే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో నేడు (అక్టోబర్ 3న) జరిగిన కెప్టెన్సీ టాస్కులో ప్రిన్స్ యావర్, శోభా శెట్టి.. వీరిద్దరూ కెప్టెన్సీ కోసం పోటీపడుతూనే సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్ బాస్ తెలిపారు. ఇక కంటెస్టెంట్స్ అంతా తమతో పాటు ఒక పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసుకొని కెప్టెన్సీ టాస్కులో పోటీపడవలసి ఉంటుంది. దీంతో ఎవరెవరు కలిసి ఆడాలి అనే విషయంపై హౌజ్‌లో పెద్ద చర్చే జరిగింది. ఫైనల్‌గా శివాజీ - పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ - టేస్టీ తేజ, శుభశ్రీ - గౌతమ్, శోభా శెట్టి - ప్రియాంక, సందీప్ - అమర్‌దీప్ కలిసి టీమ్స్‌గా ఫార్మ్ అయ్యారు.


గెలిపించేది మీ నవ్వే..
కెప్టెన్సీ కోసం బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు ఇచ్చిన మొదటి టాస్క్.. ‘గెలిపించేది మీ నవ్వే’. ఈ టాస్కులో బోర్డుపై ఒక నవ్వు చిత్రం ఉంటుంది. అందులో కొన్ని పళ్లు మిస్ అయ్యింటాయి. కంటెస్టెంట్స్ అంతా ముందు బురద, తర్వాత నురుగు దాటుకుంటూ వెళ్లి యాక్టివిటీ రూమ్‌లో ఉన్న థర్మాకాల్ బాల్స్‌లో ఉన్న మిస్ అయిన పళ్లను వెతకాలి. ఆ పళ్ల మీద ఉన్న నెంబర్స్ ఆధారంగా వాటిని చిత్రంలో అమర్చాలి. ఇలా అయిదు టీమ్స్‌కు అయిదు చిత్రాలు ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్కులో ముందుగా శివాజీ, పల్లవి ప్రశాంత్ టీమ్ చిత్రంలోని పళ్లను అమర్చి.. ముందుగా గంటను కొట్టారు. ఆ తర్వాత అమర్‌దీప్, సందీప్ ఆట పూర్తి కాకపోయినా గంటను మోగించారు. ఆ తర్వాత మెల్లగా ఆటను పూర్తి చేసుకున్నారు. మూడో స్థానంలో శోభా శెట్టి, ప్రియాంక గంటను మోగించారు. ఆట ముగిసిన తర్వాత ఏ జంట విన్నర్ అనే విషయాన్ని సంచాలకులుగా శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ నిర్ణయించాల్సి ఉంది. అక్కడే అసలు వివాదం మొదలయ్యింది.


అందరిది తప్పే..
ఒకవైపు ఆటలో కంటెస్టెంట్స్‌గా ఉండడం వల్ల సంచాలకులుగా పూర్తిస్థాయిలో అందరినీ గమనించలేకపోయారు శోభా, యావర్. దీంతో గొడవలు మొదలయ్యాయి. ముందుగా శివాజీ, ప్రశాంత్ జంట టాస్కును పూర్తి చేసి గంటను కొట్టినా.. వారు పళ్లను సరిగా అమర్చలేదని యావర్ ఆరోపించాడు. దీంతో శివాజీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏం మనుషులురా బాబు అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. తర్వాత ఎవరు, ఎంత వాదించినా.. తను మాత్రం జోక్యం చేసుకోలేదు. సంచాలకులుగా శోభా, యావర్ ఒక మాటపైన నిలబడలేకపోయారు. అమర్, సందీప్.. టాస్క్ పూర్తి కాకముందే గంట కొట్టడం వారి తప్పని తేల్చారు. ఇక శుభశ్రీ సైతం ఒక పన్నును తీసుకొచ్చి.. అది అవసరం లేదని తెలిసిన తర్వాత పక్కన పడేసింది. శోభా శెట్టి అయితే ఒకేసారి రెండు, మూడు పళ్లను తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకొని.. దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టింది. ఇలా ప్రతీ జంట.. ఏదో ఒక తప్పు చేసిందని, కానీ అందరికంటే గౌతమ్, శుభశ్రీ చేసిన తప్పు చిన్నదని భావించి సంచాలకులు వారిని విన్నర్స్‌గా ప్రకటించారు.


Also read: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో


Join Us on Telegram: https://t.me/abpdesamofficial