టసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు మేకర్స్. మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, వీడియోల్లో పక్కా మాస్ గెటప్ తో ఆకట్టుకున్నారు బాలయ్య. తాజాగా ఈ మూవీ కి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. మూవీలో మాస్ ఆంతమ్ సాంగ్ ను విడుదల చేశారు. 


ముందుగా చెప్పినట్టుగానే శుక్రవారం ఉదయం 'వీర సింహారెడ్డి' మాస్ ఆంతమ్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. 'జై బాలయ్య జై జై బాలయ్య'  అంటూ సాగే ఈ పాటతో థమన్ బాలకృష్ణ అభిమానులకు మాస్ బిర్యానీ పార్టీ ఇచ్చాడనే చెప్పాలి. లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇలాంటి పాటలు బాలకృష్ణకు బాగా సూట్ అవుతాయి. అంతకుముందు సినిమాల్లో కూడా ఇలాంటి పాటలు కనిపించాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఈ పాటను థియేటర్ లో చూస్తే ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ పాట ఇంటర్నెట్ లో మారుమోగుతోంది.


ఈ పాటతో ఎస్.థమన్ బాలకృష్ణకు మరో హిట్ సాంగ్ ను అందించాడనే చెప్పాలి. ప్రస్తుతం థమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా పెద్ద సినిమాలకు వర్క్ చేస్తూ వాళ్ళకి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అందిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇరగదీస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ కు అలాంటి మ్యూజిక్ నే అందించాడనడానికి ఈ పాటే ఉదాహరణ. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి థమన్  హింట్‌లు ఇస్తూ వచ్చాడు. పాట విడుదల చేయడానికి కొన్ని గంటలు ముందు కూడా బాలయ్య మాస్ ఆంతమ్ పాట ఇప్పుడే విన్నాను, ఈ పాట కు సౌండ్ బాక్స్ లు బద్దలౌతాయ్ అంటూ ఓ పోస్ట్ చేశారు. థమన్ చెప్పినట్టుగానే 'జై బాలయ్య' పాటకు మ్యూజిక్ ఆదరగొట్టాడు. అంతేకాదు ఈ లిరికల్ సాంగ్ లో థమన్ కూడా డాన్స్ వేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు. పాటలకే ఇలా కొడితే ఇక సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు బాలయ్య అభిమానులు.


ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా మాస్ ఎంటర్టైనర్ సినిమాల్లో నటిస్తున్నారు. ‘అఖండ’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అటు గోపిచంద్ మలినేని కూడా 'క్రాక్' సినిమా లాంటి హిట్ అందుకున్న తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్‌ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?