Pawan Kalyan About Suriya And Karthi: గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ లడ్డూ కల్తీ వ్యవహారంపై శ్రీవారిని క్షమాపణ కోరుతూ ప్రాయాశ్చిత దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి లడ్డూ గురించి తమిళ నటుడు కార్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లడ్డూ సెన్సిటివ్ అంశంగా మారిందని, దానికి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సీరియస్ కావడంతో కార్తి క్షమాపణలు చెప్పారు.


కామెడీ చేశారు కాబట్టే సీరియర్ అయ్యా- పవన్ కల్యాణ్


తిరుపతి లడ్డూ వ్యవహారం కార్తి కామెంట్స్ పై పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పారు. సూర్య, కార్తి అంటే తనకు ఎంతో ఇష్టమని, లడ్డూ అంశాన్ని కామెడీ చేయడం వల్లే కోపం వచ్చిందన్నారు. “కార్తి, సూర్య తిరుమల శ్రీవారి భక్తులు. కార్తీ తేలిగ్గా మాట్లాడినా.. నా ఉద్దేశ్యం ఆయనకు తెలుసు. వారు నిజంగా రోల్ మోడల్స్. లడ్డూ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు చాలా మంది నవ్వారు. అందుకే నాకు కోపం వచ్చింది. తమిళ సినీ పరిశ్రమను గౌరవిస్తాను. తమిళ నటులను నా సోదరులుగా భావిస్తాను” అని పవన్ కల్యాన్ చెప్పుకొచ్చారు.  






ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. పవిత్ర లడ్డూలో జంతువుల మాంసంతో తయారుచేసిన నెయ్యిని కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుకు చెందిన ల్యాబ్ కు పంపించగా నెయ్యి కల్తీ అయినట్లు తేలిందన్నారు. ఈ విషయం బయటకు రావడంతో శ్రీవారి భక్తులతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పలు హిందూ సంఘాలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా  ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ లో జరిగిన ‘సత్యం సుందరం’ మూవీ ప్రమోషన్స్ లో “యాంకర్ లడ్డూ కావాలా నాయనా?” అనడంతో కార్తి.. “ప్రస్తుతం లడ్డూ వ్యవహారం సెన్సిటివ్ అంశంగా మారింది. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది” అన్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ సీరియస్ కావడంతో కార్తి వెంటనే క్షమాపణలు చెప్పారు. అయితే, ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ కోసం పవన్, కార్తి చేసిన ప్రయత్నం అంటూ మరికొంత మంది నెటిజన్లు విమర్శలు చేశారు.


Read Also: షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ ఆర్య? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?