బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి మూడేళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ అతడి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. నటి రియా చక్రవర్తి తరచుగా ఈ టాపిక్​పై హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బయటపడిన మాదకద్రవ్యాల కేసులో ఆమె జైలుకు వెళ్లింది. దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపింది. తాజాగా సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాల అంకితా లోఖండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో లవ్ బ్రేకప్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. 


ఆ మాట విని షాక్ అయ్యాను- అంకిత


సుశాంత్ సింగ్​ను తానో ఎంతో ప్రేమించానని చెప్పింది అంకిత. అతడు మాత్రం ఇతరుల మాటలు విని తనకు దూరం అయినట్లు వెల్లడించింది. “సుశాంత్ సింగ్ ను నేను ఎంతగానో ప్రేమించాను. చెప్పుడు మాటలు విని తను నాకు దూరం అయ్యాడు. ఇద్దరం విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేవు.  తనే విడిపోదామని చెప్పాడు. ఆయన మాటలు విని నేను ఒక్కసారి షాక్ అయ్యాను. సుశాంత్ ఎందుకు ఈ మాట అన్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన మాటలు విని రాత్రంతా ఏడ్చాను. ఎంతో మదనపడ్డాను. అతడు ఎందుకు నన్ను దూరం పెట్టాలి అనుకున్నాడో ఇప్పటికీ తెలియదు. ఇకపై తెలిసే అవకాశం లేదు. ఆయన నిర్ణయాన్ని నేను ఎప్పుడూ తప్పుబట్టలేదు. ఆయన మనసుకు నచ్చిన మాట చెప్పారు. కానీ, ఆయన చెప్పిన మాట నా మనసును ముక్కలు చేసింది. ఆయనతో బ్రేకప్ తర్వాత మరొకరితో  రిలేషన్ షిప్ అంటే వణుకు పుట్టేది” అని అంకిత వెల్లడించింది.


సీరియల్స్ చేసే సమయంలో ప్రేమాయణం


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చదువు పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట్లో టీవీ సీరియల్స్ లో నటించారు. ఆ సమయంలో అంకితతో కలిసి పని చేశాడు సుశాంత్. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత సుశాంత్ హీరోగా మారడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. కొద్దికాలం తర్వాత విడిపోయారు. ఆ తర్వాత నటి రియా చక్రవర్తితో ప్రేమాయణం నడిపారు సుశాంత్. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఆయన చనిపోయారు. 


2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి


2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనది హత్య అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లింది. ఆయన మృతికి కారణాలు తెలుసుకునేందుకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.   సుశాంత్ మరణానికి సంబంధించిన కారణాలపై స్పష్టత కోసం సోషల్ మీడియాలో ఆయన డిలీట్ చేసిన పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు తెలిస్తే ఆయన మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని  భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు.    


Read Also: కొత్త జంటతో కొణిదెల, అల్లు హీరోలు- మెగాస్టార్ షేర్ చేసిన ఫోటో చూశారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial