Sai Dharam Tej About His Life: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమా ఇండడస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి ధరమ్ తేజ్ తక్కువ సమయంలోనే మంచి సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, తన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.  


యాక్సిడెంట్ తర్వాత జీవితం బాగుంది- సాయి ధరమ్ తేజ్


సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా యాక్సిడెంట్ తర్వాత తన జీవితం కొత్తగా మారిందన్నారు. “జీవితం అనేది కిందకు నెట్టినా, మళ్లీ పైకి లేచేందుకు మార్గం చూపిస్తుంది. యాక్సిడెంట్ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాను. ‘విరూపాక్ష’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాను. ‘విరూపాక్ష’ సక్సెస్ ఎలా ఉంది? అని చాలా మంది అడిగారు. సినిమా సక్సెస్ కంటే యాక్సిడెంట్ తర్వాత నా జీవితం బాగుందని చెప్పాను. యాక్సిడెంట్ అనంతరం అభిమానులు నా మీద చూపించి ప్రేమ చాలా సంతోషాన్ని కలిగించింది” అన్నారు.    


మావయ్య లెగో ఆడేందుకు పిలిచేవారు- సాయి ధరమ్ తేజ్


ఇక తన మామ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి పలు కీలక విషయాలు చెప్పాడు. “మావయ్య పవన్ కల్యాణ్ కు లెగో ఆడటం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా లెగో కొనుక్కుంటే మావయ్యకు కూడా ఒకటి తీసుకునేవారు. చిన్నప్పుడు నన్ను లెగో ఆడటానికి మావయ్య పిలిచేవారు” అని వెల్లడించాడు. అటు నిర్మాత శోభు యార్లగడ్డ సినిమా ప్లానింగ్ చాలా పక్కాగా ఉంటుందన్నాడు సాయి ధరమ్ తేజ్. ఒక సినిమాకు ప్లానింగ్ అనేది చాలా  ముఖ్యం అన్నాడు. ఆయన ప్లానింగ్ కారణంగా తాను నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే కంప్లీట్ అయినట్లు వెల్లడించాడు. ఇక హాలీవుడ్ సినిమాలతో పోల్చితే, ఇండియన్ సినిమాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయన్నాడు. స్లోమోషన్ సన్నివేశాలు భారతీయ సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పారు. 


‘యానిమల్’ లాంటి సినిమా చేయాలనుంది- సాయి ధరమ్ తేజ్


ఇక తన కెరీర్ లో కూడా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘యానిమల్’ లాంటి సినిమా చేయాలనుందని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. అలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేయడం ప్రతి నటుడికి ఇష్టం ఉంటుందన్నాడు.రణబీర్ లాంటి బోల్ట్ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. నిజంగా ‘యానిమల్’ సినిమాలో పాత్రలు చేయాలంటే ధైర్యం ఉండాలన్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.