Andhra Pradesh Election Results 2024 : గతంలో ఏ పార్టీ కూడా చూడనంత ఘోర పరాజయాన్ని వైసీపీ చవి చూసింది. 152 సిట్టింగ్  స్థానాలతో ప్రారంభించి కేవలం 9 సీట్లకు పరిమితమయింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన ఓటమిని చవి చూసింది. 152 సిట్టింగ్ స్థానాల  నుంచి చరిత్రలో ఏ పార్టీ చూడనంత ఘోరంగా.. 9 అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది. మంత్రుల్లో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే గెలిచారు. మిగతా అందరూ పరాజయం పాలయ్యారు.                            


విశాఖ జిల్లాలో రెండు స్థానాలు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయ దిశగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో మాత్రమే మరో రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. పుంగనూరు,తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. ఇక  జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కేవలం మూడు అంటే మూడు చోట్లే ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో  జగన్, బద్వేలులో దాసరి సుధ, రారజంపేటలో ఆకేపాటి ఆధిక్యంలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అంటే మొత్తంగా నాలుగు జిల్లాల్లో తొమ్మిది సీట్లు సాధించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు.                      


చాలా వరకూ ఎగ్జిట్ పోల్స్ లో ఓడిపోయినా 50  సీట్ల వరకూ వస్తాయని  చాలా మంది అంచనా వేశారు. కానీ.. ఫలితాలు అలా లేవు. కూటమికి సునామీ ఉందని తేలిపోయింది. మొదట్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప స్థాయిలో మెజార్టీలు ఉన్నా రాను రాను పర్తి స్థాయిలో పడిపోతూ వచ్చాయి. చివరికి అవి కూడా ఓటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి. లాస్‌ కి సింగిల్ డిజిట్‌కు పరిమితం కావాల్సి వచ్చింది.                   


వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాదు. వైసీపీ పక్ష నేత ఇప్పుడు సాధారణ పార్టీ నేతగానే ఉంటారు. ప్రతిపక్ష స్థానం కావాలంటే కనసం పదిహేడు చోట్ల విజయం సాధించాల్సి ఉంది. ఈ స్థానాన్ని కోరుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకుంటారు.