Elections 2024 : ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం ఏర్పడిన అల్లర్ల కారణంగా కౌంటింగ్ విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కౌంటింగ్ సెంటర్లలో గందరగోళం ఏర్పడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తుగా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఆర్వో సంతకం విషయంలో ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాలపై ఫిర్యాదు చేసిన తరవాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.  ఈసీ నిర్ణయం వల్ల  పోస్టల్ బ్యాలెట్స్ ఆర్వో సంతకం చిన్న తేడా వచ్చినా కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారని.. దాదాపుగా ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారని.. వారిలో ఏ ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేసినా అది అభ్యంతరమేనన్నారు.ఆ అభ్యంతరాలను పట్టించుకోకపోతే ఘర్షణలు జరుగుతాయన్నారు. 


పెద్ద ఎత్తున బ్యాలెట్లపై సంతకాలు చేసేటప్పుడు ఆర్వోలు నిర్లక్ష్యంగా సంతకాలు పెడతారని అన్నింటిపై ఒకేలా సంతకం ఉండదని.. అలా ఉంటే గొడవలు జరుగుతాయన్నారు. ఈ విషయంలో ఈసీ తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగే స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని అన్నారని పేర్ని నాని తెలిపారు. 


దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది.. ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ఈసీ నిబంధనలు వలన ఓటులో రహస్యం ఉండదన్నారు.  ఎన్నికల కమిషన్ చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారని ఆడిగామని తెలిపారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.  ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు.ఏపీలో ఓ రాజకీయ పార్టీ వచ్చి కాయితం ఇవ్వగానే ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించారు.  కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలంటే..  ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. 


ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఇవే :


ఏపీ సీఈవో (AP CEO) కు అందిన ఉత్తర్వులు జిల్లా అధికారులకు చేరవేశారు. పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం 13ఏ పై పోలింగ్ బూత్  ‎లో ఉన్న గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు సీల్  కూడా వేయాలి. కానీ చాలాచోట్ల గెజిటెడ్ అధికారులు సీల్ వేయలేదు. అయినప్పటికీ సంబంధిత అధికారి సంతకంతో పాటు అతని వివరాలు ఉంటే అలాంటి ఓట్లను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీల్ లేదనే కారణంతో చెల్లని ఓట్లుగా పరిగణించవద్దని ఆదేశించింది. ఇక బ్యాలెట్ పేపర్ వెనుక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫారం సీ ఓటర్ సంతకం లేదని బ్యాలెట్‎ను తిరస్కరించవద్దని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది.