AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే సీఈసీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఫిక్సయిపోయింది. తెలుగుదేశం పార్టీ 145 సీట్లలో పోటీ చేయనుంది. ఇందులో 94 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే కొన్ని సీట్ల విషయంలో మాత్రం పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేకపోతోంది. 

Continues below advertisement


యరపతినేనికి గురజాల సీటు ఖాయమేనా ?
ఉమ్మడి గుంటూరు (Guntur) జిల్లాలో గురజాల (Gurajala), నరసరావుపేట సీట్ల (NarasaraoPet Parliament)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురజాల నియోజకవర్గం ఇన్ఛార్జ్‌ యరపతినేని శ్రీనివాసరావును...నరసరావుపేటకు మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే నరసరావుపేటలో టిడిపి శ్రేణులు హడావుడి చేయడంతో...అక్కడ యరపతినేని శ్రీనివాసరావు పోటీ చేయడం ఖాయమని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు రా కదలిరా సభను గురజాలలో నిర్వహించడం ఆసక్తిరేపింది. సభను సక్సెస్ చేయడంలో యరపతినేని శ్రీనివాసరావు కీలకపాత్ర పోషించారు. దీంతో గురజాల టిక్కెట్‌ మళ్లీ యరపతినేనికే అనేలా జనాన్ని తరలించారు. దీంతో గురజాల అసెంబ్లీ మళ్లీ యరపతినేని శ్రీనివాసరావుకే అనేలా ఫీలింగ్ తీసుకొచ్చారు. సభ సక్సెస్‌ అయినా... సీటు క్లారిటీ మాత్రం రాలేదు. అంత పెద్ద బహిరంగ సభ పెట్టిన చోట అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంపైఆసక్తికర చర్చ జరుగుతోంది. 


మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట కమ్మ సామాజిక వర్గానికే
నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మాచర్ల, సత్తెనపల్లి, నరసరావు పేట మినహా మిగతా సీట్లను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలుకు కన్ఫామ్‌ చేశారన్న ప్రచారం ఉంది. లోక్‌సభ సీటు కూడా కమ్మ అభ్యర్ధికే ఖాయమైంది. అటు వైసీపీ  యాదవ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను బరిలోకి దించింది. దీంతో తెలుగుదేశం కూుడా  సీట్ల విషయాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరితే...గురజాల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కిన మల్లిఖార్జునరావు లాంటి నాయకులు గురజాల సభలో టీడీపీ కండువా కప్పుకున్నా... జంగా కృష్ణమూర్తి మాత్రం చేరలేదు.  యాదవ సామాజిక వర్గంలో కీలక నేతగా ముద్రపడిన జంగా  కృష్ణమూర్తి... వెనక్కి తగ్గి వైసీపీలోనే కొనసాగడంపై ఆసక్తికరచర్చ నడుస్తోంది. 


జంగా జంగా కృష్ణమూర్తి చేరితే టికెట్ గల్లంతేనా ? 
పార్టీలో తనకున్న పరిచయాలన్నిటినీ వాడుకొని సీటు ఫిక్స్‌ చేసుకునేందుకు యరపతినేని చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం మాత్రం నరసరావుపేట పార్లమెంట్ నుంచి బరిలోకి దించాలని భావిస్తోంది. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలుకు సన్నిహితుడైన జంగా కృష్ణమూర్తి చేరిక ఆగిపోవడంతో పార్లమెంట్ పరిధిలో ఏం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. జంగా కృష్ణమూర్తి టిడిపిలోకి వెళ్తారా ?  వెళ్తే టిక్కెట్‌ దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. గురజాల కోసం యరపతినేని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. టీడీపీ అధిష్ఠానం కరుణిస్తుందా ?  లేదంటే నర్సరావుపేటకు పంపుతుందా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే