YSRCP Vs TDP : ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయం నడవబోతోంది. ఇప్పటికే దీనిపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారికి అనుకూలమైన మీడియాలో ఎదుటి వారిపై కథనాలు వండివారుస్తున్నారు. 
బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఒకట్రెండు కాదు ఏకంగా పాతిక వేల కిలోలు సరకు చిక్కింది. సీబీఐ చెప్పిన వివార ప్రకారం బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి వచ్చిన ఎస్‌ఈకేయూ 4375380 నెంబర్ ఉన్న కంటైనర్‌లో సరకు గుర్తించారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ పేరుతో వచ్చిన ట్రక్‌లో డ్రగ్స్‌ ఉన్నట్టు తేల్చారు. ఈ విషయాన్ని ఇంటర్‌పోర్ అధికారులు సీబీఐకి అప్పగించారు. అప్రమత్తమైన సిబీఐ విశాఖ వచ్చిన కంటైనర్‌ను ఈ నెల 16 చెక్ చేశారు. 


బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటైనర్‌లో 25కిలోల చొప్పిన వె‌య్యిబ్యాగ్లు గుర్తించారు. అందులో ఎండిన ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్‌కు పంపించి పరీక్షలు జరిపారు. ర్యాండమ్‌గా బ్యాగ్‌లు చెక్‌ చేస్తే నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్, మెథాక్వలోన్  వంటి డ్రగ్స్ ఉన్నట్టు తేలింది. ఇది ఓవరాల్‌గా చెక్ చేసినప్పుడు తేలిన  విషయం. ఇంకా పూర్తిగా పరిక్షలు చేస్తే ఏ బ్యాగ్‌లో ఎంత శాతం డ్రగ్స్ ఉన్నాయో తేలనుంది. 


ఒక్కో బ్యాగ్‌లో ఎంత శాతం డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించినా దేశంలో అతి పెద్ద డ్రగ్స్‌ సరఫరా అవుతుందని అంటున్నారు. దీని ఖరీదు లక్షల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇది యావత్ దేశాన్నే షేక్ చేసే కేసు కూడా అవుతుందన్న ప్రచారం నడుస్తోంది. ఇది ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంద్యా ఆక్వా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. దీనికి డైరెక్టర్‌గా కూనం హరికృష్ణ, కంపెనీ ప్రతినిధులు గిరిధర్, పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్‌, భరత్‌కుమార్‌ సీబీఐ అధికారులు విచారించారు. తాము రొయ్యల ఆహార తయారీకి మొదటి సారిగా దీన్ని తీసుకొచ్చామని అందులో ఏమి ఉందో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. 


ఇది వైసీపీ నేతల పనిగా టీడీపీ ఆరోపణలు 
గంజాయి నుంచి ఇతర డ్రగ్స్ వరకు అన్ని వ్యాపారాల్లో వైసీపీ లీడర్లు పండిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు దొరికిన కంటైనర్‌ కూడా వారిదేనంటోంది. బ్రిజిల్‌ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఇప్పుడు దొంగలు దొరికారని లోకేష్ ట్వీట్ చేశారు. 
మరో ట్వీట్‌లో లోకేష్ ఏమన్నారంటే.."ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసిపి చీకటి మాఫియాలు జాక్ పాట్‌లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త నన్ను కలవరానికి గురిచేసింది. 


విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్.  గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఓ డబ్బా కంపెనీ (ఆషీ ట్రేడింగ్ కంపెనీ, విజయవాడ) పేరుతో వచ్చిన 21వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకోగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 
తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఆందోళన చేస్తూ వస్తోంది. ఈ చీకటి వ్యవహారాలను బయటపెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసిపి మూకలు టిడిపి కేంద్ర కార్యాలయంపై  కూడా దాడికి తెగబడ్డాయి. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు... డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్?! " అంటు ప్రశ్నించారు. 


చంద్రబాబు షాక్


చంద్రబాబు స్పందిస్తూ... విశాఖ పోర్టులో 25000 కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకుందని తెలిసి షాక్‌కి గురయ్యాను. వారికి AP పోలీసులు, పోర్ట్ ఉద్యోగులు సహకరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వారి పాత్రను స్పష్టం చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ ఏపికి చేరడం చాలా ఆనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల టైంలో డ్రగ్స్‌తో ఏం చేస్తారో?. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని, యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందనే నా భయాన్ని ఇది ధృవీకరిస్తోంది. ఈ విపత్తుకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. " అని ఆందోళన వ్యక్తం చేశారు. 


పవన్ ఆందోళన


పవన్ కూడా స్పందిస్తూ " ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసింది. ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు అనిపించేది. ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలి. 


గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మూలాలు విజయవాడలోని ఆషి ట్రేడర్స్ పేరు మీద తేలాయి. ఆ సంస్ధ వెనక ఉన్న పెద్దలు గురించి కూడా లోతుగా విచారించాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ డ్రగ్స్‌కి రాజధానిగా మార్చింది అని ప్రధాన మంత్రి సమక్షంలోనే బొప్పూడి బహిరంగ సభలో కొద్ది రోజుల కిందటే చెప్పాను. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి ఎంతగా ఉన్నాయో, సరఫరా ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలి. కేంద్ర నిఘా సంస్థలు డ్రగ్స్ రాకెట్ ను ఛేదించేందుకు చేపట్టిన ఆపరేషన్ గరుడను మరింత లోతుగా చేసి రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి. అంటూ ట్వీట్ చేశారు. 


వైసీపీ ఎదురు దాడి 


ప్రతిపక్షాల విమర్శలపై అధికార పక్షం కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. వైసీపీ సోషల్ మీడియాలో ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ డ్రగ్స్‌లో దొరికిన వారంతా టీడీపీ నేతలేనంటూ ప్రత్యారోపమలు చేస్తోంది. తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ సెటైర్లు వేస్తోంది. డ్రగ్స్‌లో వినిపిస్తున్న వారు టీడీపీ నేతలతో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. "టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..! కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని నిన్న వైజాగ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడగానే తేటతెల్లమైంది. ఇలా ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇంకేం బుకాయిస్తా. " అని వైసీపీ ట్వీట్ చేసింది.