Telangana Elections 2023: నిర్మల్ జిల్లాలో నేడు బీఆర్ఎస్, బీజేపీ , జనసేన అగ్ర నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకొని సభలో ప్రసంగించనున్నారు. బీజేపీ శ్రేణులు, నిర్మల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో సభా ప్రాంగణంతోపాటు నిర్మల్ లో పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 


సభా ప్రాంగణాన్ని పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అటు ఖానాపూర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనునారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:00గంటకు ఖానాపూర్ కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. 


సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో పోలీసు అధికారులు పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నందున, నిర్మల్ జిల్లాలో నేడు (ఆదివారం) నిర్మల్ లో ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఖానాపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటనల నేపథ్యంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత ప్రాభవం చూపనుంది.