Sharmila angry On Jagan :  వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, విజయమ్మను గతంలో తిట్టిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు తండ్రి సమానులని జగన్ అనడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచరాసభ నిర్వహించారు. ఈ సభలో జగన్ పై విమర్శలు గుప్పించారు. విజయనగరంలో నిర్వహించిన బస్సు యాత్ర సభలో జగన్ బొత్సను ఓటర్లకు పరిచయం చేస్తూ.. తన తండ్రి లాంటి వాడన్నారు.  గతంలో కాంగ్రెస్ లో ఉన్న బొత్స సత్యనారాయణ జగన్ తో పాటు విజయమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా విమర్శించారు.  తర్వాత వైసీపీలో చేరారు. ఆ మాటల్ని ఇప్పుడు గుర్తు చేసిన షర్మిల జగన్ పై విమర్శలు గుప్పించారు. 


జగన్ కేబినెట్ లో అందరూ వైఎస్ ను తిట్టిన వాళ్లే 


ఇదే బొత్స సత్యనారాయణ రాజశేఖర్ రెడ్డిని తాగుబోతు అని తిట్టారు.. ఇదే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి ఉరి శిక్ష వేయాలని కూడా అన్నారు. ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మను కూడా బొత్స అనేక మాటలు అన్నారన్నారు. అలాంటి బొత్స . . ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాన్నలాంటి వారయ్యారని మండిపడ్డారు. ఒక్క బొత్స మాత్రమే కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో వైఎస్ఆర్ ను అభిమానించే వారే లేరన్నారు. వైఎస్ పై అభిమానం ఉన్న వాళ్లు.. ఆయనను గౌరవించేవారు కేబినెట్ లో లేరన్నారు. మంత్రులు అందరూ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్లేనన్నారు. వైఎస్ ను తిట్టిన వాళ్లే మంత్రులుగా ఉన్నారన్నారు.                 


జగన్ కోసం పని చేసిన వాళ్లు ఏమీ కారు !                   


జగన్ కోసం పని చేసిన వాళ్లు ఆయనకు ఏమీ కారని.. కానీ బొత్స లాంటి వాళ్లు మాత్రం తండి సమానులయ్యారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.  జగన్ కోసం మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వారు.. గొడ్డలి పోట్లకు గురైన వారు ఆయనకు ఏమీ కావడం లేదన్నారు. అసలు వైఎఎస్ఆర్ అనే పేరులోనే వైఎస్ఆర్ లేడన్నారు. వై అంటే సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. మరి వైఎస్ఆర్‌లో వైఎస్ఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 


ఆస్తులు పంచకుండా అప్పులుగా ఇచ్చారని పరోక్షంగా విమర్శిస్తున్న షర్మిల


షర్మిల తన ఎన్నికల అఫిడవిట్ లో రూ. 83 కోట్ల మేర అప్పు జగన్  ఇచ్చినట్లుగా చూపించారు. దీనపై ఆమె స్పందించినప్పుడు..  కొంత మంది సోదరులు ఆస్తిని పంచి ఇవ్వకుండా ఒక్క కొసరు ఇచ్చి అది కూడా అప్పు కూడా రాయించుకుంటారని మండిపడ్డారు. అది జగన్ గురించేనని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా జగన్ తో పూర్తిగ విబేధిస్తున్‌న షర్మిల.. సొంత రాజకీయ బాట పట్టారు. కుటుంబంలో వ్యక్తిగత విబేధాలు కూడా రావడంతో ఆమె జగన్ పై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు.