Elections 2024 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బీార్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచనలు చేశారు.  పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మవద్దని.. దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగాలని సలహా ఇచ్చారు.  ప్రధానిగా పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలన్నారు.  ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పాలన్నారు.               

  


తెలంగాణ యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారోు.. తెలంగాణ  ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో  చెప్పాలన్నారు.  మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్  ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో  ప్రజలకు చెప్పాలని సలహా ఇచ్చారు.   తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న..  లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పాలన్నారు.  తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ..  ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్ ఐటీ..  ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్.ఐ.డీ. ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని.. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని..మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పాలన్నారు. 


లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా..తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో ప్రజలకు చెప్పాలన్నారు.  చేనేత రంగంపై జీఎస్టీ వేసి..  మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పాలన్నారు. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పాలన్నారు. 





 


మండిపోతున్న నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోయారు ..  ముడి చమురు ధరలు తగ్గినా..మోడీ హయాంలో Petrol, Diesel ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలన్నారు.  భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది..  సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు..ఎందుకు విధానాలుగా మారలేదన్నారు.  మీ పాలనలో పదేళ్లు గడిచినా..  ఇంకా ఉచిత రేషన్ పథకం కింద.. 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారని ప్రశ్నించారు.  అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి..రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను.. ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పాలన్నారు. 


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయవద్దని సూచించారు.  దేశ ప్రధాన మంత్రిగా.. ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా.. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు  చేయవద్దని సూచించారు.  దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి..  కానీ.. దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండని సలహాఇచ్చారు.  రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవని స్పష్టం చేశారు.