Huzurabad MLA Kaushik Reddy : హుజూరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానని సంతోషించేలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 506, 290, 353 ల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగి ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని సమాచారం.


పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, ఈసీ కూడా సీరియస్
హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడం తెలిసిందే. తనను గెలిపిస్తే విజయయాత్ర ఉంటుందని, లేదంటే తన శవయాత్ర ఉండడం ఖాయమని బహిరంగ సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆఖరి రోజున కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘ఇగో ఇక మీ దయ అంటున్న.. మీ దండం.. మీ గదవలు పట్టుకుంటున్న.. మీ కడుపులో తలకాయ వెడ్తున్న..’’ అంటూ కౌశిక్ రెడ్డి ఓటర్లను వేడుకున్నారు. 


గెలిపించికపోతే తన శవయాత్ర అని వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఐపీసీ 171సీ, ఎఫ్, 188, 506, 123 ఆర్పీ యాక్ట్ కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవ్ ఇటీవల తెలిపారు. ఓటర్లను భయపెట్టేలా, బెదరగొట్టేలా వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. ఈ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.