Andhra Pradesh News: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి వాయిస్‌గా చెబుతూ ఓ ఆడియో వైరల్‌ అవుతోంది. అందులో ఎవరినో ఆమె బూతులు తిడుతున్నట్టు అందులో వాయిస్ ఉంది. ఇది దళితులనే ఆమె తిట్టాలని వైసీపీ వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తన అక్క చెప్పినా తాను పట్టించుకోలేదని... వీళ్లంతా బతకనివ్వరని అసహనంతో అన్న మాటలు అందులో ఉన్నాయి. 


భువనేశ్వరి పేరుతో తిరుగుతున్న ఆడియో ఫేక్‌ది అంటోంది టీడీపీ. మొన్నటికి మొన్న చంద్రబాబు వీడియోను, తర్వాత సర్వేల పేరుతో కొన్ని ఛానళ్ల వీడియోలు తిప్పిన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు భువనేశ్వరి ఆడియో పేరుతో కొత్త కుట్రకు తెరతీశారని ట్వీట్ చేసింది. 


టీడీపీ ట్వీట్‌లో ఏమని వివరణ ఇచ్చిందంటే..."మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు. జగన్ రెడ్డి... భువనేశ్వరి అంటే ఎందుకు నీకు అంత కడుపు మంట ? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేసావ్. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని, ఓట్లు కోసం ఇంతగా దిగజారతావా ? ఏమి బ్రతుకు జగన్ నీది ? అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. 




భువనేశ్వరి ఆడియో అంటు చెబుతున్నది ఫేక్ అని... డీప్ ఫేక్‌ ద్వారా ఇలాంటివి సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన వైసీపీ చేస్తోందని మండిపడుతోంది టీడీపీ. ఓటమి భయంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.