Cash Seized in Anantapur :  ఏపీలో ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు  పెడుతున్నారు. కొన్ని చోట్ల నగదు పట్టుబడుతోంది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఫార్చునర్ కారును తనిఖీ చేశారు.  అందులో ఉన్న బ్యాగుల నిండా నోట్ల కట్టలు ఉండటంతో స్వాధీన చేసుకున్నారు. వాటి విలువ రూ. కోటి వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు వాహనాన్ని, క్యాష్ ను స్వాధీనం చేసుకుని వాటిని ఎక్కడకు తరలిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట పేరు మీద వాహనం                        


కదరిలో పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిదిగా అంచనా వేస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ నగదు  ఎక్కడిది.. ఎక్కడకు తీసుకెళ్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.  ఏపీలో ఎన్నికల అధికారులు  నిఘా పెట్టి మరీ పెద్ద ఎత్తున తరలిస్తున్న  నగదు , కానుకల్ని  పట్టుకుంటున్నారు.  AP 39 RQ 0999 వాహనంలో కారు డ్రైవర్ ఒక్కడే డబ్బులు తీసుకెళ్తుండగా అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన తనిఖీల చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.కారు నెంబర్ ఆధారంగా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వాహనంగా గుర్తించారు. నగదు ఆయనదేనని భావిస్తున్నారు. 


ఏపీలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం                                           


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ..  సరిహద్దులతో పాటు పెద్ద ఎత్తుున నహాన తనిఖీలు నిర్వహిస్తున్నారు.   తనిఖీల్లో భాగంగా రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం ను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో  అధికారులు పట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణా, గోవాల నుంచి రవాణా అవుతున్న అక్రమ మద్యాన్ని నిలువరిస్తున్నట్టు స్పష్టం చేసింది. అక్రమ మద్యాన్ని నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 39,232 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని తెలిపింది. ఈ వ్యవహారంలో 68,312 కేసులు నమోదు చేశారు.  పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా, రెవెన్యూ తదితర విభాగాలతో కలిసి 31 ఇంటిగ్రెటెడ్ చెక్ పోస్టుల నిర్వహణతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  


నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి                                                


ఏపీలో  భారీ నగదులావాదేవీలపై దృష్టి పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోనూ  లోక్ సభ ఎన్నికలు జరుగుతూండటంతో సరిహద్దుల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో   లక్షలకు లక్షలు నగదు డ్రా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్నికల్లో అక్రమాలు నివారించేందుకు అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.