ఎంబీబీఎస్, పీజీ సీట్ల భర్తీలో కామన్ కౌన్సెలింగ్‌కు తాము వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) కామన్ కౌన్సెలింగ్‌పై అభిప్రాయం కోరిన నేపథ్యంలో ఈ మేరకు ప్రత్యుత్తరం పంపింది. యథావిధిగా తామే కౌన్సెలింగ్ నిర్వహించుకుని సీట్లు భర్తీ చేసుకుంటామంది. మూడేళ్లుగా ఎన్‌ఎంసీ కామన్ కౌన్సెలింగ్‌కు ప్రతిపాదిస్తోంది. ఈ ఏడాది కూడా లేఖ రాయగా ఆ మేరకు వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యుత్తరం పంపింది.


రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఆలిండియా కోటా సీట్లు మినహా మిగిలిన 85శాతం సీట్లను, ప్రైవేటు కళాశాలల్లోని 50శాతం కన్వీనర్ కోటా సీట్లను నీట్ ర్యాంకులతో భర్తీ చేస్తోంది. దీనివల్ల ఎలాంటి అవకతవకలు జరగలేదు. కామన్ కౌన్సెలింగ్‌తో రాష్ట్ర విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లు పొందడంలోనూ అన్యాయానికి గురవుతారు. రాష్ట్రంలో పలు బీసీ కులాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో కొన్ని కులాలకు రిజర్వేషన్లు లేవు. దీనివల్ల రాష్ట్ర బీసీ విద్యార్థులు సీట్లు కోల్పోతారు అని వివరించింది.


తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఇదివరకే తెలియజేసింది. ఆలిండియా కోటా సీట్లకు ఎన్‌ఎంసీ జాతీయ కౌన్సెలింగ్ నిర్వహించే తేదీల్లోనే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహణకు కనీసం నెల రోజుల సమయం అవసరమని తెలిపింది. ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసినట్లు సమాచారం.


అభ్యంతరాలివీ..
➥ రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు పూర్తి పారదర్శకంగా భర్తీ అవుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద మినహాయించుకుంటే.. మిగిలిన 85 శాతం సీట్లను పూర్తి పారదర్శకంగా మెరిట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తున్నాం. 


➥ ప్రైవేటు కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేస్తున్నాం. 


➥ జాతీయ కౌన్సెలింగ్ ద్వారా రిజర్వేషన్ల అమల్లో సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా ఓబీసీ/బీసీ కోటా సీట్ల భర్తీలో సమస్యలు ఎదురై.. న్యాయపరమైన వివాదాలకు దారితీస్తుంది. 


➥ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 15 శాతం సీట్ల పంపిణీ అమలులో ఉంది. కామన్ కౌన్సెలింగ్ వల్ల దీన్ని అమలు చేయడం సమస్యగా మారుతుంది. 


ALSO READ:


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
కోర్సుల పూర్తివివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial