TS TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. మొదట ఫీజుల పెంపుతో బెంబేలెత్తించిన విద్యాశాఖ తాజాగా పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది.  పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 16న విడుదల చేసింది. వాస్తవానికి మే 15న హాల్‌టికెట్లు విడుదల చేయాల్సి ఉండగా.. ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసింది. ఇక హాల్‌టికెట్ల వ్యవహారంలోనూ ఉదాసీనంగా వ్యవహరించింది. అభ్యర్థులు ద‌ర‌ఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో కాకుండా.. ఇష్టానుసారం టెట్ ప‌రీక్షా కేంద్రాల‌ను కేటాయించింది. సొంత జిల్లాల్లో ప‌రీక్షా కేంద్రాలు కేటాయించాల‌ని ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీ ప‌ట్టించుకోలేదు. 


ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థుల‌కు సిద్దిపేట, హైద‌రాబాద్‌లో, కరీంనగర్ జిల్లా అభ్యర్థుల‌కు వరంగల్‌, హైద‌రాబాద్‌లో, ఖ‌మ్మం జిల్లా అభ్యర్థుల‌కు సిద్దిపేట‌లో.. ఇలా ఇష్టానుసారంగా ప‌రీక్షా కేంద్రాల‌ను అధికారులు కేటాయించారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ.. సొంత జిల్లాల‌కు చాలా దూరంగా పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ఫీజు రూ.1000 తీసుకొని... దూరపు జిల్లాల్లో పరీక్షలు జరపడం సరికాదని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లో పరీక్ష రాయాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


విద్యాశాఖ తీరుతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET) రాసే నిరుద్యోగ అభ్యర్థులే కాకుండా, ప్రమోషన్ల కోసం రాసే సర్వీస్ టీచర్లు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. గతంలో ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గూబ గుయ్యిమనిపించింది.. గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈసారి టెట్‌కు దాదాపు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 48,582 మంది సర్వీస్‌ టీచర్లు ఉన్నారు. పదోన్నతులకు టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి అని హైకోర్టు కొద్ది నెలల క్రితం పేర్కొన్నందున టీచర్లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారికి పరీక్షా కేంద్రాల దూరం కలవరపెడుతోంది. వేల మందికి ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారు. అదికూడా దూర ప్రాంతాల్లో సెంటర్లను కేటాయించారు. దీంతో అభ్యర్థులకు బస్సు ఛార్జీల రూపంలో ఆర్థిక భారం పడనుంది. 


ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించరు. అయితే పరీక్ష కేంద్రాలను సొంత జిల్లాల్లో కాకుండా దూరంగా వేరే జిల్లాలకు కేటాయించడంతో.. ముందురోజే ఆయా జిల్లాలకు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో వసతి, భోజన ఖర్చుల భారం కూడా అభ్యర్థులపై పడనుంది. కేవలం పాత 9 జిల్లా కేంద్రాలు, సిద్దిపేట, సంగారెడ్డిలలోనే పరీక్షలు జరుపుతుండటం వల్లే ఈ కష్టాలు వచ్చాయని అభ్యర్థులు వాపోతున్నారు. 


హాల్‌టికెట్లు అందుబాటులో..
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్‌-2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 16న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. టెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనరల్ నెంబరు, తమ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


తెలంగాణ టెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: 


➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.


➥ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..