Telangana Intermediate Results 2024: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 22న విడుదల కానున్నాయి. ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10తో జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21 నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరిగితే.. తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న నుంచి ఏప్రిల్ 25లోపు ఏక్షణంలోనైన‌ విడుదల చేసే అవకాశం ఉంది.


దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది.  రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్ 10 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేశారు.


జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలోనూ వాల్యూయేషన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఏప్రిల్ 20 తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.


ALSO READ:


AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజువివరాలను అధికారులు వెల్లడించారు. 






ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..