TS SSC Results Date: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారంరోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 10 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30న కుదరని పక్షంలో మే 1న పదోతరగతి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు. 


ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి జవాబుపత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 20తో మూల్యాంకనం పూర్తయింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే.. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కొంత ముందుగానే వెలువడనున్నాయి. 


గతేడాది తెలంగాణ‌లో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుద‌ల చేశారు. అయితే ఈ సారి లోక్ స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో..  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 33 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొద‌టి వారంలో తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది.


ALSO READ:


ఏప్రిల్ 22న ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు..
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ముహూర్తం ఖరారుచేసింది. పదోతరగతి ఫలితాలను ఏప్రిల్ 22న ప్రకటించనున్నారు. విజయవాడలో ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు.. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 20న ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. 


ఏపీలో లోక్ స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో.. అత్యంత వేగంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్షల పరీక్షాపత్రాల మూల్యాంక‌నం పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. గతేడాది మే 6న పదోతరగతి పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రఅసెంబ్లీకి మే 13న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆలోపే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22న ఫలితాల వెల్లడికి డేట్ ఫిక్స్ చేశారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...