తెలంగాణలో ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 29న ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 4తో ముగియనున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది విద్యార్థులు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. 


వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు బోర్డు అధికారులు యత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే మొదటి వారంలో ఇంటర్​ ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఈ సంవత్సరం స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్.. సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. దాదాపు 35 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఆన్‌స్క్రీన్ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని బోర్డు అమలు చేయనుంది. ఫలితాల ప్రక్రియను పకడ్భందీగా కొనసాగించేందుకు ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.


తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.


ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది.  ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలోనూ మూల్యాంకనం ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3తో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు,  ఏప్రిల్ 4తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జరగుతోంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇంటర్ విద్యామండలి నుంచి ఉత్తర్వులు అందుకున్న అధ్యాపకులు విధిగా హాజరవ్వాలని రవికుమార్ ఇదివరకే ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రైవేటు యాజమాన్యాలు.. తమ అధ్యాపకులు విధులకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అధ్యాపకులను పంపని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.