తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు నేడే (మే 25)న విడుదల కానున్నాయి. నేడు ఉదయం 9.30 గంటలకి విడుదల కానున్నాయి. తొలుత ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయానికి రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎం కేసీఆర్‌తో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండడం, అందులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండడంతో ఎంసెట్ ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.


నేడు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహా రెడ్డి తదితరులు ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా ఏబీపీ దేశం వెబ్‌సైట్ లో కూడా అందుబాటులో ఉంటాయి. telugu.abplive.com ద్వారా కూడా ఫలితాలను చూసుకోవచ్చు. 


సమయం మార్పుపై నిన్ననే ప్రకటన


ఫలితాల విడుదల సమయాన్ని మార్చుతున్నట్లుగా ఎంసెట్ కన్వీనర్ డా.బి డీన్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా మరికాస్త ముందుగానే ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కేంద్రాలలో మే 10 నుండి 15 వరకు నిర్వహించిన TS EAMCET 2023 పరీక్షని మొత్తం 3,20,683 మంది విద్యార్థులు రాశారు.


ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష మే 10, 11 తేదీల్లో, ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో  నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు.


ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక మెడిక‌ల్, అగ్రిక‌ల్చ‌ర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు.


మే 25 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌, ముఖ్యమైన తేదీలివే!
పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి మే 22న‌ ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.  పాలిసెట్ కౌన్సెలింగ్ కోసం క్లిక్ చేయండి..