బీటెక్, డిగ్రీ విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ సదుపాయం కల్పించేందుకు సేల్స్ ఫోర్సుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35,000 మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్ మరియు 75,000 మంది విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఏపీ ఉన్నత విద్యామండలి, సేల్స్‌ఫోర్సు కంపెనీ ఈ మేరకు ఆగస్టు 3న ఒప్పందం కుదుర్చుకున్నాయి. 



ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జేఎన్‌టీయూల్లో సెంటర్ ఆఫ్‌ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సేల్స్ ఫోర్సు ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నాస్కామ్  ఫ్యూచర్ స్కిల్స్.. మేళాలు నిర్వహిస్తుందని, మైనర్ కోర్సులను అందించేందుకు నాస్కామ్ సైతం ముందుకు వచ్చిందని తెలిపారు.


Also Read: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌

రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్ షిప్  అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇంటర్న్ షిప్  కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే స్థానిక, రాష్ట్ర స్థాయి పరిశ్రమలను గుర్తించామని చెప్పారు. ప్రస్తుత సేల్స్‌ ఫోర్స్‌ సంస్థ ద్వారా 70 వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్‌ కోర్సులు ఉచితంగా అందుబాటులో రానున్నాయని చెప్పారు.

ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న భయాలు ఉన్నా, దానివల్ల దేశ యువతకు ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు.


Read Also: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


రాష్ట్రంలో రానున్న కాలంలో ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలను (ప్లేస్‌మెంట్స్‌) అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తన కాలేజీ చదువులు ముగించి బయటకు వస్తూనే ఉద్యోగావకాశాలకు అనుగుణమైన పూర్తి నైపుణ్యాలను కలిగి ఉండేలా, ప్రపంచంలో ఇతరులతో పోటీపడి అవకాశాలను దక్కించుకునేలా రాష్ట్ర విద్యార్థులను సిద్ధం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఇందులో భాగంగా విద్యార్థులకు వర్చ్యువల్‌శిక్షణకు సంబంధించి ఆగస్టు 3న విజయవాడలోని ఏపీటీఎస్‌కార్యాలయంలో సేల్స్‌ఫోర్స్‌సంస్థతో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది.

TCSలో ఇంటర్న్‌షిప్స్ అవకాశం..
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీఈ, బీటెక్, ఇతర కోర్సులు చదువుతున్నవారు TCSలో ఇంటర్‌షిప్ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఎస్ ప్రతీ ఏటా 200 మంది ఇంటర్న్స్‌కి అవకాశం ఇస్తోంది. బీటెక్, బీఈ చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ చదువుతున్నవారు కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకుంటే టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్‌కు అప్లయ్‌ చేసుకోవచ్చు.అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ లింక్‌పై క్లిక్‌ చేసి అప్లయ్‌ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే careers.research@tcs.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
వీరే అర్హులు..
గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి పీజీ డిగ్రీ (సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, Etc.), పీహెచ్‌డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు 6 వారాల నుంచి 8 వారాల షార్ట్ ఇంటర్న్‌షిప్, 16 వారాల నుంచి 18 వారాల లాంగ్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇంటర్న్‌షిప్ వ్యవధిని మార్చుకోవచ్చు.


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..