తెలంగాణలోని పాఠశాలలు, కాలేజీలు రేపటి (అక్టోబరు 26) నుంచి పున:ప్రారంభం కానున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబరు 13 నుంచి 25 వరకు, జూనియర్ కాలేజీలకు 19 - 25 వరకు సెలవులు వచ్చాయి. దసరా సెలవులు ముగియనుండగా.. రేపటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కాగా, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీలకు అక్టోబరు 24తో సెలవులు ముగియగా.. నేటినుంచి ప్రారంభంకానున్నాయి. 


తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 13 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 13 నుంచి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సారి మొత్తం 13 రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఇచ్చారు. దసరా సెలవులు ముగియడంతో తిరిగి అక్టోబరు 26న స్కూల్స్ తెరచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 22న సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండగ ముగిసింది. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండగ జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 24న కూడా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది.


జూనియర్ కాలేజీలకు అక్టోబరు 25 వరకు..
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది.  నేటితో కాలేజీలకు సెలవులు ముగియనున్నాయి. దీంతో అక్టోబరు 26న కాలేజీలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 


పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీలకు నేటి నుంచి తరగతులు..
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ 11 రోజులపాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అక్టోబర్ 14 నుంచి 24 వరకు ఉస్మానియా యూనివర్సిటీ సెలవులు ఇచ్చింది. ఓయూ క్యాంపస్‌తోపాటు.. యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకుసెలవులు ఉంటాయని ప్రకటించింది. దీంతో అక్టోబరు 24తో సెలవులు ముగియగా, అక్టోబరు 25 నుంచి కాలేజీలన్నీ తిరిగి ప్రారంభంకాన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో కూడా నేటి నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.


ALSO READ: 


ఇంటర్ 'హాజరు' మినహాయింపు ఫీజు గడువు నవంబరు 18
తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్‌ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి, అక్టోబరు 20 నుంచి నవంబర్‌ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్‌ 30 వరకు అవకాశం ఉంది.  ఇంటర్మీడియట్ విద్యను ప్రైవేట్‌గా అభ్యసించే విద్యార్థులు పరీక్షలలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ గ్రూప్‌తో చదివే అభ్యర్థులకు, సైన్స్ నుంచి ఆర్ట్స్, హ్యుమానిటీస్‌కు తమ గ్రూప్‌ను మార్చు కోవాలనుకునే వారికి అవకాశం కల్పించినట్టు ఇంటర్మీడియట్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అక్టోబరు 18న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఇదివరకు మొదటి, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు అదనంగా రెండో భాషగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 


ఇంటర్‌ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్‌ మార్కుల్లో టాప్‌-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్‌ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...