NEET UG 2022ని వాయిదా వేయాలని విద్యార్థుల నుంచి భారీ డిమాండ్‌ వస్తున్న వేళ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ వింగ్ కీలక ప్రకటన చేసింది. NEET UG 2022ని వాయిదా వేయలేదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలిపింది. NEET UG 2022 పరీక్షను సెప్టెంబరు 4కి వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక సర్క్యులర్ ప్రచారం చేయడంతో PIB నుంచి స్పష్టత వచ్చింది. PIB సర్క్యులర్‌ను 'నకిలీ' అని తేల్చింది. 


"నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG)ని జూలై 17, 2022కి బదులుగా 4 సెప్టెంబర్ 2022కి రీషెడ్యూల్ చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక నోటీసు హల్ చల్ చేస్తోంది" అని PIB ట్వీట్ చేసింది.






#JUSTICEforNEETUG, #DeferNEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం ద్వారా NEET UG 2022ని వాయిదా వేయాలని సోషల్ మీడియాలో పలువురు వైద్య పరీక్షల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సమయంలో PIB నుంచి స్పష్టత వచ్చింది. అయితే, NTA NEET UG 2022 వాయిదా వేయడాన్ని ధృవీకరించ లేదు. NTA త్వరలో NEET అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. నీట్‌ అడ్మిట్ కార్డ్ 2022 ntaneet.nic.inలో అందుబాటులో ఉంటుంది.


గత వారం చాలా మంది వైద్య అభ్యర్థులు విద్యా మంత్రికి లేఖ రాశారు. మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ, పరీక్షకు సిద్ధం కావడానికి తమకు తక్కువ సమయం ఉందని చెప్పారు. ఆ లేఖలో అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయడానికి గల కారణాలను సూచించారు. ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి పరీక్షను 6 వారాల పాటు వాయిదా వేయాలని అధికారులను కూడా కోరారు. 


MBBS అభ్యసించి డాక్టర్ కావాలనేది లక్షల మంది విద్యార్థుల కల. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కూడా ఈ పరీక్షపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రిపరేషన్‌కు సరైనా సమయం లేదనందున చాలా మంది ఈ ఏడాదికి నీట్‌ ఆశలు వదులుకుంటున్నట్టు చెబుతున్నారు. దయచేసి వారికి తగిన సమయాన్ని కేటాయించండి, తద్వారా వారు పరీక్షకు బాగా సిద్ధమవుతారని లేఖలో పేర్కొన్నారు.