NEET UG 2025 Application Last Date: దేశంలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్-యూజీ)-2025' దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 7న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు గడువు మార్చి 7న రాత్రి 11:50 గంటలతో ముగియనుంది. దరఖాస్తు ముగింపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోలేకపోయినవారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు మార్చి 9 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. గతేడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంబీబీఎస్లో మొత్తం 1,08,000 సీట్లు అందుబాటులో ఉండగా.. సుమారుగా 56 వేల సీట్లు ప్రభుత్వ, 52 వేల సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి.
ఈ కోర్సుల్లో ప్రవేశాలు..
నీట్ ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు.. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ (BHMS) కోర్సులో ప్రవేవాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్సీ నర్సింగ్ (BSc Nursing) కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అర్హతలు..
➥ 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సంబంధిత గ్రూపులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి.
➥ విదేశాల్లో ఎంబీబీస్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి.
➥ జనరల్ కేటగిరి విద్యార్థులు వరుసగా 9 ఏళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు గరిష్టంగా 15 ఏళ్లు హాజరవ్వొచ్చు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31.12.2007కు ముందు జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయో సడలింపు ఉంటుంది. ఈ అభ్యర్థుల గరిష్థ వయసు 25 సంవత్సరాలకు మించకూడదు.
పరీక్ష ఫీజు..
నీట్ యూజీ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు పరీక్ష ఫీజుగా జనరల్ క్యాటగిరీవారు రూ.1700; ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు చెందినవారైతే రూ.1600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.1000గా నిర్ణయించారు. భారతదేశం వెలుపల ఉన్నవారు దరఖాస్తు ఫీజు కింద రూ.9500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి సిటీ ఇంటీమేషన్ స్లిప్స్ను ఏప్రిల్ 26న విడుదల చేయనున్నారు. విద్యార్థులు మే 1 నుంచి నీట్ అడ్మిట్కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 14లోపు ఫలితాలు విడుదల చేయనున్నారు.
పరీక్ష విధానం..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్(National Eligibility cum Entrance Test) యూజీ (NEET UG 2025) పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంతో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయం 180 నిమిషాలు(3 గంటలు) ఉండనుంది. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది.
NEET(UG)-2025 Registration and Online Application